రాం మాధవ్ తో గంటా భేటీ : బీజేపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి..!
Recommended Video
మాజీ మంత్రి..టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన గంటా తాజాగా బీజేపీ ముఖ్యనేత రాం మాధవ్ తో సమావేశమయ్యారు. తాను బీజేపీలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజులుగా రాజ్యసభ సభ్యుటు..టీడీపీ నుండి బీజేపీలో చేరిన సుజనా చౌదరి..సీఎం రమేష్ తో గంటా చర్చలు జరిపారు. వారి ద్వారా రాం మాధవ్ తో సమావేశమయ్యారు.
కొంత కాలంగా ఆయన టీడీపీ వీడుతారనే ప్రచారం సాగుతున్నా...నిర్ణయం తీసుకోలేదు. ఇక, తాజాగా విశాఖలో పవన్ నిర్వహించిన లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించినా..ఆయన గైర్హాజరయ్యారు. ఇక, ఇప్పుడు బీజేపీ అగ్రనేతలతో మంతనాలు ద్వారా ఆయన టీడీపీకి రాజీనామాకు సిద్దపడినట్లు సమాచారం. అయితే, గంటా మరో ఇద్దరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
టీడీపీతో దూరం పాటిస్తూ...
గంటా టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైనా..తొలి నుండే టీడీపీ లో కొనసాగటం పైన అయిష్టంగానే ఉన్నారు. ఆయన వైసీపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని చెప్పటం..అదే సమయంలో తన భవిష్యత్ కు సంబంధించి తాను కోరుకున్న హామీ దక్కకపోవటంతో గంటా వైసీపీలో చేరటం పైన నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో తన మాజీ మిత్రుడు అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.
కొంత కాలంగా గంటా మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గంటా వైసీపీలోకి రావటాన్ని ఆయన వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో..ఆయన విశాఖ నగరంలో బీజేపీ నుండి ప్రాతినిధ్యం వహించటం ద్వారా తన సామర్ధ్యం నిరూపించుకొనే అవకాశం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా చంద్రబాబు ఆదేశించినా..పవన్ కళ్యాన్ నిర్వహించిన లాంగ్ మార్చ్ కు దూరంగా ఉన్నారు. రెండు రోజులుగా ఢిల్లీలో ఉంటూ తాను బీజేపీలోకి వెళ్లటానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన పార్టీ మార్పు పైన మరింత సాగదీయకుండా నిర్ణయం తీసుకొనే ఆలోచనలో గంటా ఉన్నారు. దీంతో..ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి...
బీజేపీలోకి వచ్చేందుకు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరితో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మంతనాలు సాగించినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేతో పాటుగా..విశాఖ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. గంటా ఇక..వైసీపీలో కాకుండా బీజేపీలోనే చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
దీంతో..ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు గంటాతో నడవటానికి సిద్దంగా ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సుజనా చౌదరితో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాం మాదవ్ తో భేటీ సమయంలో నూ గంటా తో ఈ అంశాల మీద చర్చ జరిగినట్లు సమాచారం. ముందుగా ఈ నెల 10న గంటా టీడీపీకి రాజీనామా చేసి..బీజేపీలో చేరాలని భావించినట్లు చెబుతున్నారు. అయితే, తన సన్నిహితులతో మాట్లాడి పార్టీలో చేరిక ముహూర్తం పైన నిర్ణయం తీసుకుంటానని గంటా చెప్పినట్లు సమాచారం. దీని ద్వారా..ఆయన టీడీపీని వీడుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని విశాఖ నేతలు చెబుతున్నారు.
అనర్హత వేటు.. భవిష్యత్ పైనే చర్చలు..
టీడీపీ నుండి గెలిచిన గంటాతో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ శాసనసభ సాక్షిగా చేసిన కీలక ప్రకటన ద్వారా వారు రాజీనామా చేసిన తరువాత పార్టీ మారాల్సి ఉంది. ఇదే అంశం పైన గంటా బీజేపీ నేతలతో చర్చలు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ప్రజలు ఇప్పుడే ఉప ఎన్నికలను సమర్ధించే పరిస్థితి ఉండదు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారే అవకాశం లేదు. దీంతో..అనర్హత వేటు..అదే విధంగా బీజేపీలో చేరితే తమకు లభించే ప్రాధాన్యత మీదనే వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. అనర్హత వేటు పడకుండా ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో గంటా వేసే రాజకీయ అడుగుల పైన ఆసక్తి నెలకొని ఉంది. అదే విధంగా గంటాతో పాటుగా టీడీపీ వీడే ఎమ్మెల్యేల పైన చర్చ మొదలైంది.