ఎప్పటికైనా హైదరాబాద్ వీడాల్సిందే: అశోక్, హోదాపై మంత్రి గంటా
నెల్లూరు: తాత్కాలిక ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సొంత రాష్ట్రానికి తరలి వెళ్లేందుకు సిద్ధం కావాలని ఏపిఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. ఆదివారం రాష్ట్ర జేఏసీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తాత్కాలిక రాజధాని హైదారబాద్ని ఎప్పటికైనా వదలాల్సిందేనని చెప్పారు. నూతన రాజధానిలో ఉద్యోగులందరికీ తగిన వసతులు కల్పించడంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెలో ఏపిఎన్జీవోలు భాగస్వాములుకావాలని అశోక్బాబు పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదా వస్తుందో, ప్యాకేజీ వస్తుందో త్వరలోనే తేలిపోతుంది: గంటా
విశాఖపట్నం: స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి సాంకేతిక ఇబ్బందులున్నాయని కేంద్రం తెలిపిందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. విశాఖపట్టణంలో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబుతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని కేంద్రం చెప్పిందన్నారు.
ప్రత్యేకహోదా, ప్యాకేజీపై కేంద్రం తర్జనభర్జనలు పడుతోందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో, ప్రత్యేకహోదా కంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని తెలిపిందని అన్నారు. ప్రత్యేకహోదా వస్తుందో రాదో తెలియదు కానీ, హోదా కంటే మెరుగైన ప్యాకేజీ వస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.