ప్రశాంత విశాఖపట్నంలో అరాచకశక్తులు..: ఎగ్జిక్యూటివ్ రాజధాని అందుకేనా అంటూ గంటా ఆందోళన
విశాఖపట్నం: ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నంను చేస్తామంటూ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనను స్వాగతించిన టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో గంటా సహా టీడీపీ నేతలు సమావేశమై రాజధాని విషయంపై చర్చించారు.
విశాఖను ప్రకటించడం సంతోషమే కానీ..
ఈ సందర్బంగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం సంతోషం కలిగించే విషయమేనని అన్నారు. అయితే, అమరావతిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.
ప్రశాంత నగరంలో అరాచక శక్తులు..
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఎన్నికల కోసమే ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే ఆలోచన చేశారని అనుమానం కూడా ఉందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో ప్రశాంత నగరంలో అరాచక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని గంటా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలన్నారు.
విశ్వనగరం కావాలంటే..
మెట్రో, రోడ్లు వేస్తే విశాఖపట్నం విశ్వనగరం అయిపోదని.. మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని, ట్రాఫిక్, హౌసింగ్ లాంటి అంశాలపై జాగ్రత్తలుతీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా తెలియజేస్తున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు..
కాగా, మూడు రాజధానుల ప్రభుత్వ ప్రకటనపై ఇప్పటికే అమరావతిలో తీవ్ర ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రైతులకు రాజకీయ నాయకులు, న్యాయవాదులు కూడా మద్దతు తెలుపుతున్నారు. హైకోర్టును తరలించవద్దంటూ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ఇక్కడ్నుంచి తరలించి తమకు అన్యాయం చేయొద్దంటూ రైతులు కోరుతున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే తాము తమ భూములను ఇచ్చామని, ఇప్పుడు భూములను తిరిగి ఇచ్చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాజధానిని తరలించేందుకు తాము అంగీకరించమంటై అమరావతిలో భారీ ఎత్తున రైతులు, ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు వారికి మద్దతు పలుకుతున్నారు. ఇక కర్నూలులో హైకోర్టు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అని ప్రభుత్వం ప్రకటించడంతో ఆ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు.