విశాఖ భూ కుంభకోణంపై ఏపీ సీఎం జగన్ కు మాజీ మంత్రి గంటా బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతారని ప్రచారం జరగగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చే సీన్ లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలతో తేటతెల్లమైంది.
జగన్ పై విమర్శలు చేయని గంటా ... ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు వైయస్ జగన్ పైన ఎలాంటి విమర్శలు చేయని గంటా శ్రీనివాసరావు తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ లేశారు.ఆయన రాసిన లేఖలో విశాఖ భూ కుంభకోణం నివేదికను బయటపెట్టాలని, సిట్ విచారణ ను పునః ప్రారంభించాలని,విశాఖపట్నం భూ కుంభకోణం కేసులో మళ్లీ దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇక ఈ కేసు విషయంలో చాలా మంది వైసీపీ నేతలు సిట్ దర్యాప్తు కోరుకుంటున్నారని, ఇక వారి డిమాండ్ ను తాను సైతం స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
విశాఖ భూ కుంభకోణంపై గంటా లేఖ .. సర్వత్రా ఆసక్తి
విశాఖ భూ కుంభకోణంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంది నాడు మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు. విశాఖ భూ కుంభకోణం విషయంలో అటు నాటి ప్రతిపక్షాల నుండే కాకుండా , సొంత పార్టీ నుండి కూడా పలు విమర్శలు ఎదుర్కొన్నారు గంటా శ్రీనివాసరావు. ఇక ఈ నేపథ్యంలో విశాఖ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని గంటా శ్రీనివాసరావు జగన్ కు రాసిన లేఖ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ఎంత పెద్దవారున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గంటా శ్రీనివాసరావు.
సీఎం జగన్ విశాఖ భూకుంభకోణం నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేసిన గంటా
ఇక తాను మంత్రిగా ఉన్న సమయంలోనే సిట్ నివేదికను బయటపెట్టాలని కోరానని, అయినా బయట పెట్టి లేదని వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు నివేదికలోని అంశాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.గంటా శ్రీనివాసరావు కి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ కూల్చివేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నా, ఇక అంతే కాకుండా విశాఖ భూ కుంభకోణం గురించి, గంటా శ్రీనివాసరావు కి సంబంధించిన పలు అక్రమ నిర్మాణాల గురించి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా గంటా శ్రీనివాసరావు మాత్రం ఒక అవంతి శ్రీనివాస్ ను మినహాయించి వేరే ఎవరి పైన మాటల దాడి చేయడం లేదు. జగన్ సర్కార్ తో ఎలాంటి కాంట్రవర్సి లేకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు గంటా శ్రీనివాసరావు. ఇక అలాగే జగన్ వంద రోజుల పాలనకు శుభాకాంక్షలు తెలిపారు.