స్పీకర్ ఫార్మాట్ లో లేని గంటా రాజీనామా లేఖ ... విశాఖ ఉక్కు కోసం హై డ్రామా.. మతలబు ఇదేనా ?
విశాఖ ఉక్కు ఉద్యమం కేంద్రంగా రాజకీయంగా పుంజుకోవాలని టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎత్తుగడ వేశారా ? అందులో భాగంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానంటూ హడావిడి చేశారా? స్పీకర్ కురాజీనామా లేఖ పంపిన మరుసటి రోజే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి థాంక్స్ చెప్పి వైసిపికి అనుకూలంగా వ్యవహరించడం రాజకీయ మనుగడ కోసమే నా ? అంటే అవును అనే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు: లక్షల కోట్లు కొట్టేద్దామని ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా?
విశాఖలో గత 20 నెలలుగా సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గెలిచిన నాటి నుండి నేటి వరకు నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాదు తాను ఎమ్మెల్యేగా గెలిచిన టిడిపి కోసం కూడా పని చేసిన దాఖలాలు లేవు. అధికారంలో ఏపార్టీ ఉంటే, ఆ పార్టీలోకి జంప్ చేసే నేతగా పేరున్న గంటా శ్రీనివాసరావు వైసిపి తీర్థం పుచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో విశాఖ భూ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన గంటా శ్రీనివాస్ విషయంలో విముఖత వ్యక్తం చేశారన్నది సమాచారం .
విశాఖ ఉక్కు ఉద్యమం వేదికగా రాజకీయ మనుగడ కోసం గంటా ఎత్తుగడ
దీంతో అటు అధికార పార్టీలో చేరలేక, ఇటు ప్రతిపక్ష పార్టీలో నోరు విప్పలేక రాజకీయంగా మనుగడను కోల్పోతున్నారు గంటా శ్రీనివాసరావు.
ఇదే సమయంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించడం గంటా శ్రీనివాసరావుకు రాజకీయంగా మళ్ళీ ముందుకు రావడానికి అవకాశం కల్పించింది. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తన రాజకీయ భవితవ్యం కోసం వాడుకోవాలని భావించిన గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసి అందరి ఫోకస్ ఒక్కసారిగా తనపై పడేలా చేశారు . అంతేకాదు స్పీకర్ కు లేఖ సైతం పంపించారు.
స్పీకర్ ఫార్మాట్ లో లేని గంటా రాజీనామా లేఖ .. వెల్లువగా విమర్శలు
అయితే గంటా శ్రీనివాసరావు స్పీకర్ కి రాసిన లేఖ స్పీకర్ ఫార్మాట్ కు విరుద్ధంగా ఉండటంతో, వ్యూహాత్మకంగానే గంటా శ్రీనివాస్ విశాఖ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ఎంపీగా, 4 దఫాలుగా ఎమ్మెల్యే గా పని చేస్తున్న గంటా శ్రీనివాసరావు శాసన సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో కూడా తెలియదా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గంటా ఉక్కు ఉద్యమం .. విశాఖ ప్రజల కోసం కాదు .. రాజకీయ ఉనికి కోసమని చర్చ
గత 20 నెలలుగా నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని గంటా శ్రీనివాసరావు, ఒక్కసారిగా విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తానని రాజీనామా చేయడం కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికేనన్న భావన వ్యక్తమవుతోంది.
ఇన్నాళ్లు జనాల్లోకి రాలేకపోయిన గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవితవ్యం కోసం, విశాఖ ఉక్కు ఉద్యమాన్ని వేదికగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని స్థానికంగా ఉన్న రాజకీయ వర్గాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబుకు సైతం చెప్పకుండా గంటా రాజీనామా .. ప్రజలు ఆదరించే సీన్ లేదని లోకల్ టాక్
కనీసం మాట మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పకుండా రాజీనామా చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు పదవి కావాలని, అదును కోసం ఎదురు చూస్తున్న గంటా శ్రీనివాసరావుకు ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం మొదలైన ఉద్యమం అవకాశం ఇచ్చినప్పటికీ, గంటా శ్రీనివాసరావును గతంలోలా ప్రజలు ఆదరించేలా లేరనేది స్థానికంగా సాగుతున్న చర్చ.