గంటా చేతులెత్తేస్తారా? జగన్ కంచుకోటలో టీడీపీ బలోపేతం అసాధ్యమేనా?
కడప : ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోన్న కడప జిల్లాలో పాగా వేసేందుకు గతంలో టీడీపీ చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. 2014 ఎన్నికల్లో కడప నుంచి ఒక్కటంటే ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది టీడీపీ. వైసీపీ తొమ్మిది స్థానాలను దక్కించుకుంది. దీంతో అధికారంలోకి రాగానే జిల్లాలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
ఇందుకోసం మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపిన టీడీపీ.. జిల్లా ఇంఛార్జీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే..! అసలు జిల్లా ఇంఛార్జీ బాధ్యతలు ఎందుకు తీసుకున్నానా? అని భాదపడుతున్నారట గంటా. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా జిల్లా నేతల తీరులో మాత్రం ఏమాత్రం మార్పు రావట్లేదట.
ముందు నుంచి వర్గ రాజకీయాలకు పెట్టింది పేరైన కడపలో.. టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. దీంతో సొంత గూటి నేతల మధ్యే బేధాభిప్రాయాలు తలెత్తడం సర్వ సాధారణంగా మారిపోయాయి. ఇక ఈ నేతలందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే బాధ్యతలను తన భుజానేసుకుని లేని తలనొప్పిని అంటించుకున్నానని గంటా వాపోతున్నట్లుగా కడప రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంటా రూపొందించే ప్లాన్స్ ను ఏమాత్రం లెక్క చేయకుండా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు వ్యవహరిస్తుండడం మంత్రి గారిలో తీవ్ర అసంతృప్తిని రాజేసినట్లు తెలుస్తోంది.
పార్టీ అధిష్టానం పాల్గొనే కార్యక్రమాల్లో సైతం తమ వర్గపోరును బయటపెట్టుకుంటుండడం మంత్రి గంటాకు ఏమాత్రం మింగుడుపడడం లేదట. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. లోకేష్ ఆధ్వర్యంలో కడపలో ఏర్పాటు చేసిన టీడీపీ సభలో జిల్లా నేతలు బాహాబాహికి దిగడమే. రాయచోటి, బద్వేలు ప్రాంతాలకు చెందిన నేతల గ్రూపు రాజకీయాలు ఈ కార్యక్రమంలో బయటపడ్డాయి. ఇలా.. కడప మొత్తంలో టీడీపీ గ్రూపులు 30 వరకు ఉండవచ్చునన్నది ఒక అంచనా. ఇదే విషయాన్ని చంద్రబాబుతోను విన్నవించుకున్న మంత్రి గంటా.. ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.