కేంద్రమంత్రికి ప్రత్యేక సెగ: టీడీపీ ఎంపీల నిలదీత, జవదేకర్ గట్టి కౌంటర్
అనంతపురం: కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పర్యటనలో తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజకీయ వేడి రాజేశారు. సెంట్రల్ యూనివర్సిటీని ప్రారంభించేందుకు వచ్చిన కేంద్రమంత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రులు విభజన హామీలపై కేంద్రాన్ని విమర్శించగా, యూనివర్సీటి రావడానికి చంద్రబాబు కారణమని చెప్పారు.
ఆ తర్వాత మాట్లాడిన జవదేకర్ కూడా వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఉండవని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. జాతి నిర్మాణంలో రాజకీయాలు ఉండవని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ఇచ్చిన హామీలను అన్నింటిని వరుసగా నెరవేరుస్తున్నామని చెప్పారు. తమ నినాదం అభివృద్ధి అని, రాజకీయాలు కాదన్నారు.
అంతకుముందు మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ.. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని కోరారు. రైతులు, యువత సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. జేఎన్టీయూ కృషి వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పారు. టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రిని ప్రశ్నించారు.
జవదేకర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన సమయంలో ఎంపీ నిమ్మల హోదా, విభజన హామీలపై ప్రశ్నించారు. అలాగే, మంత్రులు గంటా, పరిటాల కూడా వివిధ సందర్భాల్లో ఈ అంశాలను ప్రస్తావించారు. విద్యార్థులు కూడా పలువురు ప్రత్యేక హోదా అంశంపై అడిగారని తెలుస్తోంది. మొత్తానికి జవదేకర్పై హోదా విషయంలో టీడీపీ ఎంపీలు ప్రశ్నల వర్షం కురిపించగా, ఆయన మాత్రం అభివృద్ధికి, రాజకీయాలు వేర్వేరని గట్టి కౌంటర్ ఇచ్చారు.
అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీని జవదేకర్ ప్రారంభించారు. జేఎన్టీయూ ఇంక్యుబేషన్ సెంటర్లో తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ లోగోను ఆవిష్కరించారు.
జవదేకర్ అబద్దాలు చెప్పారు: గంటా
యూనివర్సిటీలన్నీ తాత్కాలిక భవనాల్లోనే కొనసాగుతున్నాయని మంత్రి గంటా ఆ తర్వాత చెప్పారు. డీపీఆర్ మంజూరు చేసి వెంటనే శాశ్వత భవనాల కోసం నిధులు మంజూరు చేయాలని జవదేకర్ను కోరామనిచెప్పారు. జవదేకర్ అన్నీ అవాస్తవాలు చెబుతున్నారన్నారు. చట్టంలో పెట్టిన వాటికి అతీగతి లేని పరిస్థితి అన్నారు. విశాఖ ఐఐఎంను నాలుగేళ్లుగా పట్టించుకోలేదని ఆరోపించారు. 17 యూనివర్సిటీలకు సంబంధించి కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తిరుపతి సభలో ఓ వైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలో మోడీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని చెప్పారు.