ఎన్నిసార్లు అభాసుపాలైనా గరుడ శివాజీ ఇక మారడా: శివాజీ కొత్త పురాణంపై మండిపడుతున్న వైసీపీ
ఏపీ రాజకీయాల్లో గత ఎన్నికల ముందు ఆపరేషన్ గరుడ అంటూ హడావిడి చేసిన సినీ నటుడు శివాజీ మొదటినుంచి టిడిపిని కాపాడడం కోసం విఫల యత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కేంద్రం ఆపరేషన్ గరుడ పేరుతో కొత్త కుట్రలు చేస్తుందంటూ గరుడ పురాణం వివరించారు శివాజీ. అలా గరుడ పురాణం తో గరుడ శివాజీ గా మారిన ఆయన ఆ తరువాత టీవీ9 ఫోర్జరీ వివాదంలో కేసుల్లో ఇరుక్కున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభాసు పాలయ్యారు. ఇక రాజకీయ తెర మీద కనిపించడు అనుకున్న శివాజీ మరోమారు సంచలన ఆరోపణలతో, దేశద్రోహం జరుగుతుంది అంటూ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మీద విరుచుకుపడుతూ, ఇక ఒక కాంట్రాక్టు సంస్థ ను టార్గెట్ చేసి కొత్త పురాణం మొదలెట్టాడు.
గరుడ
శివాజీ
సంచలన
ఆరోపణలు:
ఇద్దరు
ముఖ్యమంత్రులు..ఆ
కాంట్రాక్టర్
టార్గెట్..!
వైసీపీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్న శివాజీ కొత్త సినిమా
ఇక శివాజీ ప్రారంభించిన ఈ కొత్త పురాణం వైసీపీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇప్పటికే పరువు పోగొట్టుకున్న శివాజీ మరోమారు అభాసుపాలు కావటం ఖాయం అని అంటున్నారు శివాజీ కొత్త సినిమా వీడియో చూసిన వైసీపీ శ్రేణులు . టీడీపీ అధినేత చంద్రబాబు కు సపోర్ట్ ఇవ్వటానికే శివాజీ రంగంలోకి దిగాడు . చంద్రబాబు డైరెక్షన్ లో శివాజీ ఈ కొత్త సినిమాకు తెరలేపారు అని ఆరోపిస్తున్నారు. శివాజీ పుక్కిట పురాణాలను ప్రజలు నమ్మరని తేల్చి చెప్తున్నారు.
గత ఎన్నికల ముందు ఆపరేషన్ గరుడ అంటూ సంచలన ఆరోపణలు చేసిన శివాజీ
గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ లో పెట్టుకొని సంచలన ఆరోపణలతో ఆపరేషన్ గరుడ పురాణం చెప్పారు శివాజీ. 2019 ఎన్నికల్లో టిడిపి విజయమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఈ ఆపరేషన్ గరుడ పురాణం చెప్పినట్లుగా పలు విమర్శలు కూడా ఆయనపైన వెల్లువెత్తాయి. ఓ దశలో టిడిపిలో చేరినట్లుగా వ్యవహరించిన శివాజీ టీడీపీ నేతలపైన సీబీఐ, ఈడీ దాడులు గురించి, జగన్ పై దాడి జరుగుతుందనే విషయం గురించి, ఇక ఎన్నికల సమయంలో టిడిపిని మట్టి కనిపించడానికి బిజెపి సర్కార్ చేస్తున్న వ్యూహాలను గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .
ప్రభావం చూపించని శివాజీ ఆపరేషన్ గరుడ , ద్రవిడ లు
ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రావిడ అంటూ భవిష్యత్తును చూసినట్లుగా, అంతా తనకు తెలుసన్నట్లుగా కేంద్రం కుట్రలను, ప్రతిపక్షం కుట్రను ప్రజలముందు ఉంచుతున్నట్లుగా నానా హంగామా చేశారు. ఆపరేషన్ గరుడ అంటూ సంచలనం సృష్టించి ఏదో జరగబోతోందని భయాందోళనలను ప్రజలకు కలిగేలా చేశారు. అయినా ఫలితం శూన్యం. టిడిపి గెలవాలని భావించిన శివాజీ లక్ష్యం నెరవేరక పోగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ పురాణం విఫలమైంది.
టీవీ9 ఫోర్జరీ వివాదం.. పారిపోతూ పట్టుబడ్డ శివాజీ
ఇక ఆ తర్వాత గరుడ శివాజీ టీవీ9 వివాదాల్లో చిక్కుకున్నారు. రవి ప్రకాష్ తో కలిసి టీవీ9 వాటాల వ్యవహారంలో ఫోర్జరీ చేశారు అన్న వివాదంలో శివాజీ చిక్కుకున్నారు. ఆయన పైన అరెస్టు వారెంట్ జారీ కాగా చాలా రోజుల పాటు శివాజీ అజ్ఞాతం లోనే ఉన్నారు. తమపైన కావాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. శివాజీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసారు. ఈ నేపథ్యంలో తప్పించుకుని విదేశాలకు పారిపోవాలని ప్రయత్నం చేసిన శివాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. అలంద మీడియా కేసులో ఇరుక్కున్న శివాజీ అమెరికా వెళ్లడానికి ప్రయత్నించిన క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శివాజీ అరెస్ట్ అయ్యారు. దీంతో మరోమారు శివాజీ అభాసు పాలయ్యారు.
ఏ మీడియా సపోర్ట్ లేక సోషల్ మీడియాను ఆశ్రయించిన శివాజీ కొత్త సినిమా
ఇప్పుడు తాజాగా ఏ మీడియా సపోర్టు చేయకపోవడంతో సోషల్ మీడియా ను వేదికగా చేసుకొని శివాజీ మరోమారు తన పుక్కిటి పురాణాలను మొదలుపెట్టారని వైసిపి భావిస్తోంది. తాజాగా ఒక వీడియోను రిలీజ్ చేసిన శివాజీ ఆ వీడియో లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం కేసీఆర్, జగన్ లపై సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు సీఎంలు మేఘా కాంట్రాక్ట్ సంస్థ కృష్ణారెడ్డి కి లాభం చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని , ఇది దేశద్రోహం తో సమానం అని మండిపడ్డారు. ఇక దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ, వాటిని ప్రతివారం బయట పెడతానంటూ సంచలన ఆరోపణలు చేశారు గరుడ శివాజీ.
జగన్ , కేసీఆర్ , మేఘా సంస్థ కృష్ణా రెడ్డి టార్గెట్ గా ఆరోపణలు
మేఘా సంస్థ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లో 35 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పిన శివాజీ ఆ సంస్థ తో పాటుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఇక ఓఎన్జీసీ రిగ్గుల కేటాయింపులోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని అవన్నీ బయటపెడతానని పేర్కొన్నారు.మేఘా కృష్ణారెడ్డికి చెందిన సంస్థ నడుపుతున్న ఎలక్ట్రిక్ బస్సులతో ఆయనకు భారీ ఎత్తున లబ్ధి చేకూరుతోందని, ఇందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పూర్తిగా సహకరిస్తున్నారని కూడా శివాజీ ఆరోపణలు గుప్పించారు.
శివాజీ ఈ సినిమాతో చావుదెబ్బ తినటం ఖాయం అంటున్న వైసీపీ
అందులో భాగంగా ఆయన వెలుగులోకి తెస్తున్న దశలవారీ మరో గరుడ పురాణం కూడా ఫెయిల్ అవుతుందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు రచించిన రాజకీయ కుట్ర అని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు గరుడ పురాణం, ద్రవిడ పురాణాలతో అభాసు పాలైన, టీవీ9 వివాదంలో చిక్కుకొని కేసుల పాలైన శివాజీ మరోమారు సోషల్ మీడియాలో చూపించే కొత్త సినిమాతో చావు దెబ్బ తినటం ఖాయమని వైసిపి వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఏపీ సర్కార్ ప్రతిష్టకు బంధం కలిగించడానికే గరుడ శివాజీ కుట్రలు అని ఫైర్ అవుతోంది వైసిపి. చూడాలి మరి శివాజీ చూపించే కొత్త సినిమా రాష్ట్రంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో..