గరుడ శివాజీ సంచలన ఆరోపణలు: ఇద్దరు ముఖ్యమంత్రులు..ఆ కాంట్రాక్టర్ టార్గెట్..!
గరుడ శివాజీ మరో సారి తెర మీదకు వచ్చారు. కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న శివాజీ ఈ సారి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అందులో ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రులను..ఒక కాంట్రాక్టు సంస్థను టార్గెట్ చేసారు. దోపిడీకి పాల్పడుతున్నారంటూ విమర్శించారు. ముఖ్యమంత్రులు..కాంట్రాక్టర్లు కలిసి దోచుకుంటున్నారంటూ ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని ముఖ్యమంత్రులతో కలసి మేఘా సంస్థ దోచుకుంటోందని తీవ్ర ఆరోపణలకు దిగారు.
ఎప్పుడూ చూడలేదని శివాజీ
తాను ఇక ప్రతీ వారం వారు చేస్తున్న దోపిడీల గురించి సాక్ష్యాలతో సహా వీడియోలు పోస్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. తనకు ప్రాణ హానీ ఉందని..అది తెలిసి గతంలోనే ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదులు చేసానని వివరించారు. మేఘా సంస్థ బీజేపీక సైతం ద్రోహం చేస్తుందని చెప్పుకొచ్చారు. ఓఎన్జీసీ రిగ్గులు దక్కించుకోవటంలో జరిగిన అవినీతి గతంలో ఎప్పుడూ చూడలేదని శివాజీ ఆరోపించారు.
ఇద్దరు ముఖ్యమంత్రులను లక్ష్యం చేసుకొని..
గరుడ శివాజీ తన వీడియో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు 800 కోట్లకు పైగా ప్రజాధనం ఆదా అయిందని ప్రభుత్వం చెబుతున్న సమయంలో శివాజీ ఈ రివర్స్ కాంట్రాక్టు విషయంలో జరిగిన అంశాలను..సాక్ష్యాలతో సహా బయట పెడుతానన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 35వేల కోట్ల చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు.
నీళ్లు..నిధులు..నియమకాలు..పేరుతో తెలుగు సమాజాన్ని రెండు చీల్చిన ప్రముఖులు బంగారు తెలంగాణ నినాదంతో కాంట్రాక్టర్ల తో కలిసి దోపిడీ చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాను చెబుతున్న ప్రతీ అంశానికి ఆధారం..సాక్ష్యం ఉందని శివాజీ పేర్కొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు..మేఘా సంస్థతో లింకు పెడుతూ శివాజీ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఓఎన్జీసీలో దారుణమైన అవినీతి..
ఓఎన్జీసీలో కొందరు అవినీతి పరుల కారణంగా దారుణమైన అవినీతి చోటు చేసుకుందన్నారు. మేఘా సంస్థ ఏకంగా 27 రిగ్గులను దోచుకుంటోందని ఆరోపించారు. ఏడేళ్ల కాలంలో ఏకంగా 26 వేల కోట్లకు మేఘా యజమాని ఎలా ఎదిగారో తాను వివరిస్తానన్నారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో అవినీతి చేసి జేబులు నింపుకున్నారంటూ విమర్శించారు. మేఘా సంస్థ ముప్పుగా మారిందని ఆరోపించారు, ఇక నుండి ప్రతీ వారం అవినీతిని ఆధారాలతో సహా బయట పెడతానని ప్రకటించారు.
నరకం అనుభవిస్తున్నానని
నాలుగు నెలలుగా తాను మానసికంగా నరకం అనుభవిస్తున్నానని..తనకు అపాయం పొంచి ఉందన్నారు. తనకు ఉన్న అపాయం గురించి ఇప్పటికే ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసానని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యల వీడియో రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తెలంగాణ ప్రతిపక్ష నేతలు..పోలవరం రివర్స్ టెండరింగ్ కాదు అది రిజర్వ్ టెండర్ అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో శివాజీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసారు.