విశాఖలో తప్పిన పెను ముప్పు: గ్యాస్ సిలిండర్ పేలుళ్లతో దద్దరిల్లిన హైవే..
రాత్రి 11.45కి శబ్దాలతో మూడు సిలిండర్స్ గాల్లోకి ఎగరడం చూసి తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
విశాఖపట్నం: గుడిలోవ దగ్గర అర్థరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ల లారీ పేలుడు భిభత్సం సృష్టించింది. కి.మీ దూరం వరకు పేలుడు శబ్దాలు వినిపించడంతో చుట్టుపక్కల ప్రాంతాలు సైతం దద్దరిల్లాయి.
అనకాపల్లి-శ్రీకాకుళం హైవేపై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
లారీకి అడ్డుగా వచ్చిన ఓ పిచ్చి వ్యక్తిని తప్పించబోతుంటే లారీ చెట్టుకు ఢీ కొందని, దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీలో ఉన్న మొత్తం 350 సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలుతూ వచ్చాయని డ్రైవర్ చెప్పాడు.
రాత్రి 11.45కి శబ్దాలతో మూడు సిలిండర్స్ గాల్లోకి ఎగరడం చూసి తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ప్రమాదం సంభవించిన సమయంలో కొద్ది నిమిషాల్లోనే పోలీసులకు సమాచారం చేరింది. దీంతో డ్రైవర్ కు ఫోన్ చేసి ఘటనను నిర్దారించుకున్నారు.
అనంతరం నాలుగు ఫైరింజన్స్ ను రంగంలోకి దించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారుగా తెల్లవారుజామున నాలుగ గంటల వరకు మంటలను ఆర్పుతూనే ఉన్నారు. అప్పటికీ ట్యాంకర్లలో నీళ్లయిపోవడంతో.. తిరిగి నీటిని నింపుకురావడానికి వాటిని పంపించారు.
హైవే మీద చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. చెట్లు, తుప్పలు లాంటివి అంటుకోవడంతో పూర్తి స్థాయిలో మంటలు ఆర్పడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.