ఓఎన్జీసీ గ్యాస్ లీక్: భారీగా నష్టం, భయంతో ప్రజలు
విజయవాడ: కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలోని చినపాండ్రాక పరిధిలోని ఓఎన్జీసీ ప్లాంట్కు చెందిన గ్యాప్ పైప్ లైన్లో మరోసారి సోమవారం గ్యాస్ లీక్ అయింది. ఆదివారం రాత్రి గ్యాస్ పైప్ లైన్ లీక్ కాగా, ఓఎస్జీసీ అధికారులు గ్యాస్ పైప్ లైన్కు మరమ్మతులకు ఆదేశించారు.
రెవిన్యూ అధికారుల సమక్షంలో గ్యాస్ లీకేజీని ఓఎస్జీసీ సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఓఎన్జీసీ బావుల నుంచి క్రూడాయిల్ లీకవుతోంది. ఆయిల్ లీకేజీ కారణంగా దాదాపు 25ఎకరాల్లో వరి పంట, 60కొబ్బరి చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు మాట్లాడుతూ గ్యాస్ లీకేజ్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రైతులకు వారం రోజుల్లో ఓఎన్జీసీ నుంచి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టరు హామీ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా ఈ బావుల నుంచి క్రూడాయిల్ తీస్తున్నారు. రిగ్గింగ్ కేంద్రం పక్కనే ఉన్న పొలాల్లోకి బురదతో కూడిన క్రూడాయిల్ పడటంతో గ్రామస్తలు భయంతో వణికిపోయారు. 24 గంటలు గడవక ముందే రెండు సార్లు గ్యాస్ లీక్ అవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.