గ్యాస్ లీక్ ఘటన .. ఎమ్మెల్యే రోజా, ఎంపీ విజయసాయి స్పందన.. సాయమందిస్తామన్న స్వామీ స్వరూపానంద
విశాఖపట్టణం మహా నగరంలోని ఆర్.ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ నుండి లీకైన ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ తో ఇప్పటికి 8 మంది మృతి చెందగా వేల సంఖ్యలో అస్వస్థులయ్యారు . ఇక చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఇక ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది .పలువురు ప్రముఖులు ఈ ఘటనపై ప్రస్తుతం స్పందిస్తున్నారు. తాజాగా ఈ దుర్ఘటనపై నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసి చైర్మన్ రోజా, ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు . శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆపన్న హస్తం అందిస్తామని చెప్పారు.
వైజాగ్లో విషవాయువు లీకైన ఘటనపై ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఇక ఇదే సమయంలో విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పిన విజయసాయి రెడ్డి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని , ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు .
ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందుతోందని చెప్పిన ఆయన ఎవరికీ ఆందోళన వద్దు అని పేర్కొన్నారు . సహాయ చర్యల్లో ప్రభుత్వానికి సహకరిద్దామని విజయసాయిరెడ్డి ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇక విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ఘటన దురదృష్టకరం అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అంతే కాదు చేతనైన సాయం చేస్తామని వెల్లడించారు .
Recommended Video
భగవంతుడి ఆశీస్సులతో పరిస్థితి తిరిగి నార్మల్ కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా విష వాయువు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు విశాఖ శారదాపీఠం, వానప్రస్థం వృద్దాశ్రమం చేయూత అందిస్తాయని తెలిపారు. పదివేల మందికి వానప్రస్థం వృద్దాశ్రమంలో మధ్యాహ్న భోజనం అందించటం కోసం ఆహారం పంపిణీకి నిర్ణయం తీసుకున్నామని స్వామీజీ తెలిపారు.