అంతర్వేదిలో ఓఎన్జీసీ పైప్లైన్ లీక్ ... పరిపాటిగా మారిన గ్యాస్ లీకేజ్ .. ఆందోళనలో స్థానికులు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఓఎన్జీసీ పైపులైను లీకేజ్ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. గత అర్ధరాత్రి ఓఎన్జీసీ పైపులైను లీక్ కావటం తో ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయం గుప్పిట్లో స్థానికులు బిక్కుబిక్కుమన్నారు. లీకైన ప్రాంతం నుంచి సహజ వాయువు ఎగసి పడుతుండడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. విషయం తెలిసిన అధికారులు ఘటనా స్థలానికి రావడానికి ముందే స్థానిక యువత లీకేజీని కొంతవరకు నియంత్రించ గలిగింది. ఇక పైప్ లైన్ లీకేజ్ లు అంతర్వేదిలో నిత్య కృత్యంగా మారటంతో స్థానికుల్లో అసహనం వ్యక్తం అవుతుంది.
ప్రేమికుల పంచాయితీలో అమానుషం .. బాలిక గుండెలపై తన్ని... ఆపై కర్రతో బాది..
అంతర్వేదిలో ఓఎన్జీసీ పైపులైను లీకేజ్ పై స్థానికుల ఆగ్రహం .. ఘటనా స్థలంలో ఆందోళన
అధికారుల నిర్లక్ష్యం వల్ల, సరిగా మెయింటనెన్స్ లేకపోవటం వల్ల గ్యాస్ పైప్లైన్ లీక్ ఇక్కడ పరిపాటి కావడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అభాద్రతాభావానికి గురవుతున్నారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. తమ పరిస్థితి అధికారులకు పట్టటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా శాశ్వతంగా పరిష్కరించాలంటూ ఘటనా స్థలంలో యువకులు బైఠాయింఛి ఆందోళన చేపట్టారు.
గడచిన రెండు నెలల్లో పలు మార్లు లీక్ అయిన గ్యాస్ ...
ఇక ఇటీవల కూడా అంతర్వేది గ్రామం గునిశెట్టి వారి పుంత పరిసర ప్రాంతాల్లో గ్యాస్ లీకైంది. అంతర్వేది పరిసర ప్రాంతాల నుంచి కేశవదాసుపాలెం మీదుగా మోరి జిసిఎస్ కు వెళ్లే పైపులైన్ ద్వారా పంట పొలాల్లో గ్యాస్ లీక్ అవడంతో గ్రామస్థులు భయందోళన చెందారు. ఉదయం పొలాలకు వెళ్లే గ్రామస్థులు గ్యాస్ లీకేజీని చూసి అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే పంట పొలాల్లో గ్యాస్ లీకేజ్ ప్రభావం ఎక్కువ కాగా గ్రామస్థులకు ముచ్చెమటలు పట్టాయి. స్థానిక ఓఎన్జీసీ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి బావుల వద్ద ఉన్న వాల్వ్స్ను అదుపు చేయడంతో గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చింది.
లీకేజ్ లను నియంత్రించాలని కోరుతున్న స్థానిక ప్రజలు .. నగరం ఘటన పునరావృతం అవుతుందేమో అని ఆందోళన
గత రెండు నెలల్లో సఖినేటిపల్లి మండలంలోని కేశవదాసు పాలెం, మోరి లో గ్యాస్ లీకేజ్ లు మూడు సార్లు సంభవించాయి. అంతర్వేది లో సైతం పైప్ లైన్ లీకేజ్ కావడం తో మామిడికుదురు మండలం లోని నగరం ఘటన పునరావృతం అవుతుందేమోనని స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తక్షణమే లీకేజ్ లను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. సఖినేటిపల్లి ఎస్ఐ వి.శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్యాస్ లీకేజీలపై దృష్టి సారించాలని ఓఎన్జీసీ అధికారులను కోరారు. లీకేజీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక తాజాగా మరోమారు గ్యాస్ లీకేజ్ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని, ఓఎన్జీసీ అధికారుల వైఖరిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.