Vizag Gas Leakage : విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ చరిత్ర ఇదే..
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి స్టైరిన్ అనే విష వాయువు లీకైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే అధికారిక లెక్కలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఫ్యాక్టరీకి సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో దాదాపు 200 మంది ప్రభావితమయ్యారని చెబుతుండగా.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునన్న వాదన వినిపిస్తోంది. బాధితులకు ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనపై ఇప్పటికే కలెక్టర్ మీనా ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో అసలు ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ చరిత్ర ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..
1961లో విశాఖలో ఫ్యాక్టరీ ఏర్పాటు
కొరియాకు చెందిన ఎల్జీ కంపెనీని విశాఖలో 1961లో స్థాపించారు. మొదట్లో హిందూస్థాన్ పాలిమర్స్ను భారత్లో తమ అనుబంధ సంస్థగా చేర్చుకుని ఉత్పత్తికి అనుమతిచ్చింది. 1978లో ఎంసీ డొవెల్,యూబీ గ్రూప్ సంయుక్తంగా ఎల్జీ అనుమతితో హిందూస్తాన్ పాలిమర్స్ను టేకోవర్ చేశాయి. తిరిగి 1997లో ఎల్జీ పూర్తి స్థాయిలో ఎంసీ డొవెల్,యూబీ గ్రూప్ నుంచి ఫ్యాక్టరీని టేకోవర్ చేసుకుంది.
213 ఎకరాల విస్తీర్ణం.. రోజూ 417 టన్నుల ఉత్పత్తి..
విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురం సమీపంలో దాదాపు 213 ఎకరాల్లో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ప్రతిరోజు 417 టన్నుల పాలిస్టైరిన్ ఉత్పత్తి జరుగుతోంది. స్టైరిన్ అనే ముడిసరుకుతో పాలిస్టైరిన్ను తయారుచేస్తారు. లాక్ డౌన్ మొదలైన మార్చి 25వ తేదీ నుంచి ఫ్యాక్టరీ మూతపడింది. ఇటీవలి సడలింపుల నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకుంది.
Recommended Video
ట్రయల్ రన్ నిర్వహించలేదన్న విమర్శలు..
నిజానికి ఫ్యాక్టరీని పున:ప్రారంభించే ముందు ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి.. అవసరమైతే వేరే ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇవేవీ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం గ్యాస్ లీకైన తర్వాత సైరన్ కూడా మోగించలేదు. దీంతో సమీప గ్రామాల్లోని ప్రజల్లో గాఢ నిద్రలో విష వాయువును పీల్చుకుని ప్రాణపాయ స్థితిలోకి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున 3.30గం. సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. కళ్ల మంటలు,శ్వాస సమస్యతో చాలామంది పరిగెత్తుతూనే కుప్పకూలిపోయారు. తాళ్లతో కట్టేసిన మూగజీవాలు ఎటూ పరిగెత్తలేక అక్కడిక్కడే చనిపోయాయి. చెట్లు కూడా మాడిపోయాయి. ఈ ఘటనపై ప్రస్తుతం సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.