ఏపీలో మళ్లీ గ్యాస్ లీకేజీ కలకలం: కెమికల్ ఫ్యాక్టరీ నుంచి: ఉలిక్కిపడ్డ కాకినాడ: నెలరోజుల్లో
కాకినాడ: గ్యాస్ లీకేజీ ఉదంతాలు మన రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. కిందటి నెల 7వ తేదీన విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరీన్ గ్యాస్ వెలువడిన తరువాత.. తరచూ అలాంటి సంఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నెల రోజుల వ్యవధిలో గ్యాస్ లీకేజీ సంఘటన చోటు చేసుకోవడం ఇది మూడోసారి. తాజా ఉదంతం తర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సమీపంలోని సర్పవరంలో చోటు చేసుకుంది.
చాలాకాలం నుంచి సర్పవరంలో కేంద్రంగా పని చేస్తోన్న టెకీ అనే ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి సోమవారం తెల్లవార జామున గ్యాస్ వెలువడినట్లు గుర్తించారు. ఈ ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న ప్రజలు ఘాటు వాసనలతో కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. ఈ గ్యాస్ తీవ్రత తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదని తెలుస్తోంది. ఘాటు వాసన వెలువడిన వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గ్యాస్ లీక్ అయిన విషయాన్ని తెలుసుకున్న టెకీ కెమికల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు తక్షణ చర్యలను తీసుకున్నారు. గ్యాస్ వెలువడుతోన్న ప్రదేశాన్ని గుర్తించారు. గ్యాస్ లీకేజీని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చిందని తెలుస్తోంది. ఇంతకుముందు తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీకి చెందిన పైప్ నుంచి గ్యాస్ పైకి ఎగదన్నిన విషయం తెలిసిందే. కాకినాడ సమీపంలో సముద్రం నుంచి వెలికి తీసిన సహజ వాయు నిక్షేపాలను తరలించడానికి ఏర్పాటు చేసిన పైప్ నుంచి అప్పట్లో గ్యాస్ లీక్ అయింది.
2021లో ఉప ఎన్నికల కోసం వైఎస్ జగన్ భారీ స్కెచ్: పావులు కదుపుతున్నారంటోన్న వైసీపీ
ఆ సంఘటనలనూ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. ఎల్జీ పాలిమర్స్ ఉదంతం చోటు చేసుకున్న తరువాత గ్యాస్ లీకేజీ అంటే ప్రజలు గుండెలు అరచేత్తో పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇప్పటిదాకా 13 మంది మరణించగా.. సుమారు 300 మందికి పైగా స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. ఇంతకుముందు నెల్లూరులో ఓ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన గోడౌన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించినప్పటికీ.. ప్రాణనష్టం చోటు చేసుకోలేదు.