గేట్ 2021 పరీక్షలో భారీ మార్పులు..బీఏ విద్యార్ధులకూ ఛాన్స్- బీటెక్ థర్డ్ ఇయర్ కూ...
కరోనా కారణంగా ప్రజా జీవనం అతలాకుతలం అవుతుండగా.. విద్యార్దుల చదువులు దాదాపు అటకెక్కాయి. ఇప్పుడు జాతీయ స్ధాయి కోర్సులు, ఉద్యోగాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష గేట్ లోనూ భారీ మార్పులు జరిగాయి. కరోనా కారణంగా విద్యార్ధులకు చదువుకునే అవకాశం లేకుండా పోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గేట్ పరీక్షలో పలు మార్పులు చేస్తూ, సడలింపులతో బోంబే ఐఐటీ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. త్వరలో పరీక్ష నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. తాజా మార్పులతో ఈసారి గేట్ పరీక్ష రాసే అభ్యర్ధుల సంఖ్యతో పాటు పోటీ కూడా భారీగా పెరిగే అవకాశముంది.
Recommended Video
ఏపీలో కరోనా: లక్షకు చేరువగా కేసులు - 1041 మరణాలు.. ఆ రెండు జిల్లాల్లో బీభత్సం..
భారీ మార్పులతో గేట్ 2021
ఐఐటీలు, పీజీ, పీహెచ్డీ పరీక్షల్లో ప్రవేశానికి, కేంద్ర ప్రభుత్వ సంస్ధల్లో ఉద్యోగాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష గేట్ (గ్రాడ్యుయేట్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) లో ఈసారి భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా కారణంగా విద్యార్ధులు చదువులు పూర్తి చేసే అవకాశం లేకపోవడంతో విద్యార్హతల్లో పలు మార్పులు చేయడంతో పాటు కొత్త సబ్జెక్టులను చేర్చి గేట్ రూపురేఖలు మార్చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గేట్ పరీక్షల షెడ్యూల్ ను ఐఐటీ బొంబాయి తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి ఆరు రోజుల పాటు ఆన్ లైన్ లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాసేందుకు ఎవరెవరికి అర్హతలు కల్పించారు, ఏయే సబ్జెక్టులు కొత్తగా వచ్చి చేరాలన్న అంశంపైనా ఐఐటీ క్లారిటీ ఇచ్చింది.
కొత్తగా వీరికే అవకాశం....
జాతీయ స్ధాయిలో ఏటా నిర్వహించే గేట్ పరీక్షకు ఇప్పటివరకూ ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదివిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తుండగా.. ఈసారి కరోనా కారణంగా బీఏ చదివిన వారికీ, బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న వారికీ పరీక్ష రాసే ఛాన్స్ ఇచ్చారు. దీంతో 10 ప్లస్ 2 ప్లస్ 4గా ఉన్న ఫార్మాట్ కాస్తా 10 ప్లస్ 2 ప్లస్ 3గా మారిపోయింది. తాజా మార్పుతో బీఏ చదివి గేట్ పరీక్షలో అర్హత సాధించిన వారు ఐఐటీల్లో కొత్తగా చేర్చబోతున్న ఎంఏ కోర్సు చదువుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఉద్యోగాల ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు. కరోనా ప్రభావం తగ్గాక నిర్వహించే ఉద్యోగాల ఇంటర్వ్యూలకు దీన్ని వర్తింపజేస్తారు.
గేట్ లో కొత్త సబ్జెక్టులు ఇవే..
వచ్చే ఏడాది జరిగే గేట్ పరీక్ష అర్హతల్లో చేసిన మార్పుల ఫలితంగా కొత్తగా రెండు సబ్జెకులు ఈ పరీక్షలో వచ్చి చేరాయి. బీఏ చదివిన వారి కోసం ఈ మార్పు చేశారు. ఇప్పటివరకూ 25 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష జరిగేది. తాజాగా రెండు సబ్జెక్టులుగా ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ను చేర్చారు. అలాగే ఇప్పటివరకూ ఒక్క సబ్జెక్టును ఎంచుకుని పరీక్ష రాస్తే సరిపోయేది. ఈసారి నుంచి రెండు సబ్జెక్టులను ఎంచుకునేలా మార్పు చేస్తున్నారు. ఈ రెండు సబ్జెక్టులు ఏవి అనేది త్వరలో ఐఐటీ బోంబే ప్రకటించనుంది. తాజా మార్పులతో బీఎస్సీతో పాటు బీఏ విద్యార్ధులకూ గేట్ రాసేందుకు వీలుగా కొత్త సబ్జెక్టులు వచ్చి చేరాయి.
పరీక్షల నిర్వహణలోనూ మార్పులు..
గతంలో గేట్ పరీక్షలు రెండు విడతలుగా నాలుగు రోజుల పాటు ఆన్ లైన్లో జరిగేవి. ఈసారి పెరగబోతున్న పోటీ, అభ్యర్ధుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు వీలుగా ఆరు రోజుల పాటు గేట్ 2021 పరీక్ష జరగబోతోంది. కరోనా కారణంగా ఉద్యోగావకాశాలు తగ్గనుండటం, ఉన్నత విద్యా కోర్సులకు డిమాండ్ పెరగడం, ఉద్యోగాల పోటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ మార్పులు చేసింది. తాజా మార్పులతో ఎక్కువ మందికి అవకాశం దక్కడమే కాకుండా క్వాలిఫైడ్ అభ్యర్ధులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అందుబాటులోకి వస్తారు. పోటీ తత్వం పెరగడం కూడా మంచిదేనని కేంద్రం చెబుతోంది.