ఏపీ ఆదర్శం: బాబుపై బిల్ గేట్స్ ప్రశంసలు, ‘జగన్ పాదయాత్ర ఎందుకో?’
అమరావతి: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే రోజు ఇంకెంతో దూరంలో లేదని మైక్రోసాఫ్ట్, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.
విశాఖపట్టణంలో గతేడాది నవంబరులో నిర్వహించిన అగ్రిటెక్ సమ్మిట్-2017కు హాజరైన బిల్గేట్స్ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు.
సీఎం దూరదృష్టితో..
వ్యవసాయంలో రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నారని చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించారు. అగ్రిటెక్ సదస్సు ముఖ్యమంత్రి దూరదృష్టికి అద్దం పడుతోందన్నారు. భూసార పరీక్షల మ్యాపింగ్తో పాటు వ్యవసాయ విధానాలను రైతులకు చేరవేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
ఏపీని ఆదర్శంగా..
ఆరోగ్యరంగంలో చేపడుతున్న సంస్కరణలు, పొరుగు సేవల విధానంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు కితాబిచ్చారు. అధికశాతం ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ భారత్లోనే ముందంజలో ఉన్న విషయాన్ని తెలుసుకున్నానన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా బిల్గేట్స్ సూచించారు.
Recommended Video
పోలవరం వేగవంతం
పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్డ్యాం నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అడ్డంకులన్నీ తొలగిపోయాయని, పనులు మరింత వేగవంతమవుతాయని ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాలు కొద్దిపాటి హెచ్చుతగ్గులు తప్ప ఒకే రీతిలో ఉన్నాయని సాగుకు, పరిశ్రమలకు నీరు సమృద్ధిగా ఇవ్వగలిగితే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఏపీ సస్యశ్యామలమే..
పోలవరం ప్రాజెక్టు పనులను సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించారు. గేట్ల నమూనాను పరిశీలించి.. ఎగువ కాఫర్డ్యాం పనులను ప్రారంభించారు. అనంతరం స్పిల్వే నిర్మాణ ప్రాంతంలో ఆయన మాట్లాడుతూ.. నాగావళి, వంశధార, పెన్నా, కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని వినియోగించుకుంటే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. డయాప్రమ్వాల్ నిర్మాణ పని 62 శాతం జరిగిందని.. మిగిలినది మే, జూన్ నెలాఖరునాటికి పూర్తిచేసేలా ఎల్ అండ్ టీ, బావర్ కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. అనంతరం ఎర్త్కమ్ రాక్ఫిల్డ్యాం పనులు చేపట్టాల్సి ఉందన్నారు.
పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో?
ఓ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తున్నారని, ఎవరికోసం ఈ యాత్ర చేస్తున్నారో వారే చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ఇది రాష్ట్ర విభజన సమయంలో చేసి ఉంటే ఎంతో మేలు జరిగేదని, ఏడు మండలాలు విలీనం చేయకపోతే పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లేదా?, సీలేరు నుంచి నీరు వచ్చేదా? అని ప్రశ్నించారు. ఇంకో పార్టీ రాయలసీమకు నీరిస్తే సస్యశ్యామలమై తమ పార్టీ పునాదులు కదిలిపోతాయన్న ఉద్దేశ్యంతో అన్ని రకాలుగా అడ్డుపడుతోందన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర నుంచి పోలవరం ప్రాజెక్టుకు మొదటి అంచనాల ప్రకారం రూ.16 వేల కోట్లలో అందించాల్సిన సాయం అందిందని, ఇంకా మిగిలినది కొంతవరకూ రావాల్సిఉందని, రెండోదశలో తిరిగి అంచనాలు రూపొందించి పంపామని సీఎం వెల్లడించారు. కేంద్రం అన్నివిధాలా సాయం చేసే దిశగా నడుస్తోందని.. కేంద్ర జలవనరులశాఖా మంత్రి నితిన్గడ్కరీ సంక్రాంతి తర్వాత వస్తారని చంద్రబాబు తెలితిపారు.