ఎన్టీఆర్ ప్రసంగంపై బాబుకు గట్టు సవాల్, గౌడ్ ఆగ్రహం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు మంగళవారం సవాల్ విసిరారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో టిడిపి కార్యకర్తలు హత్యకు గురయ్యారని చంద్రబాబు మహానాడులో అన్నారు. దీనిపై గట్టు మండిపడ్డారు.
చంద్రబాబు ఓ విషసర్పం లాంటివాడన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించింది చంద్రబాబే అన్నారు. రక్తచరిత్ర ఆయనదే అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చివరి ప్రసంగాన్ని మరోసారి మహానాడు వేదిక పైన ప్రసారం చేయగలవా అని సవాల్ విసిరారు.
టిడిపి మహానాడు సొంత డబ్బా.. పరనిందలా కనిపిస్తోందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను చంపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చేంత వరకు తాము పోరాటం కొనసాగిస్తామన్నారు.
చంద్రబాబుకు శ్రీనివాస్ గౌడ్ కౌంటర్
వార్ రూం ఏం ఎకె 47 కాదని, సమాచార సేకరణకేనని తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వేరుగా అన్నారు. తెరాస వార్ రూం పైన చంద్రబాబు మండిపడుతున్న విషయం తెలిసిందే. దీనిపై గౌడ్ స్పందించారు. సీమాంధ్ర ఉద్యోగులను తాము తెలంగాణలో పని చేయనివ్వమని చెప్పారు.
ప్రజాతీర్పు శిరసావహిస్తాం: గండ్ర
తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామని గండ్ర వెంకటరమణ రెడ్డి వరంగల్ జిల్లాలో అన్నారు. ప్రజా సమస్యలపై తాము తెరాస ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. ఏడాదిలోగా భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు.