కేసీఆర్తో గట్టు, విజయ: జగన్కు షాక్, చీఫ్ వ్యూహమా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత గట్టు రామచంద్ర రావు ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవడం చర్చకు దారి తీసింది. గట్టు రామచంద్ర రావుతో పాటు మరో సీనియర్ నేత జనక్ ప్రసాద్ కూడా కేసీఆర్ను కలిశారు.
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం అంతగా లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ముఖ్యనేతలు తమ దారి చూసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. ఎన్నికలకు ముందే పలువురు నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు.
ఇప్పుడు గట్టు రామచంద్ర రావు, జనక్ ప్రసాద్లు కేసీఆర్ను కలవడంతో వారు తెరాస వైపు చూస్తున్నారా? అనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆంధ్రప్రదేశ్లోను ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఎస్పీవై రెడ్డి టీడీపీ వైపు వెళ్లారు. తాజాగా కొత్తపల్లి గీత ఆ జాబితాలో ఉన్నారంటున్నారు. ఇప్పుడు తెలంగాణలోను ముఖ్యనేతలు అధికార తెరాస వైపు చూస్తున్నారు.
వీరి కలయికలో మరో వాదన కూడా వినిపిస్తోంది. వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహంతో తెరాసలో చేరదల్చుకున్నారా? లేక జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధినేత ఆదేశంతో భేటీ అయ్యారా? అనే చర్చ సాగుతోంది. అయితే, తెరాస సీనియర్ నేత కేకే నివాసంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహరచన సమావేశానికి హాజరు కావడం మరింత చర్చనీయాంశమైంది.
మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నేత విజయా రెడ్డి కూడా కేసీఆర్ను కలిశారు. ఈమె తెరాసలో చేరాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయా రెడ్డి స్వర్గీయ పీజేఆర్ కూతురు.
తెలంగాణలో పలువురు కాంగ్రెసు, టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఇప్పటికే టీడీపీ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడైనా గులాబీ కండువా కప్పుకోవచ్చునని అంటున్నారు.