రేవంత్ని చంద్రబాబే ఇరికించారు: గట్టు, ఏసిబి కష్టడి పిటిషన్ వాయిదా
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి.. ఈ కేసులో వాస్తవాలను వెంటనే బయటపెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడివి? ఎవరు ఇప్పిచ్చారు? ఎవరు ఇవ్వమన్నారు?, అతనికి తర్వాత ఇస్తామన్న రూ.4.50 కోట్లు ఎక్కడున్నాయో చెప్పాలని అన్నారు.
రేవంత్రెడ్డిని ఈ కేసులో ఎవరు ఇరికించారో టిడిపి అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఈ కేసులో రేవంత్ను ఇరికించింది చంద్రబాబేనని గట్టు అన్నారు. చంద్రబాబు దొంగల ముఠా నాయకుడని, ఏ తప్పు చేయలేదన్నట్టు విషయాన్ని బుకాయిస్తూ మాట్లాడుతున్నాడని విమర్శించారు.
చంద్రబాబుకు పిచ్చిపట్టిందని రామచంద్రరావు మండిపడ్డారు. ఎన్నికలు, వెన్నుపోట్లు చంద్రబాబు నైజమన్నారు. ఆంధ్రా ప్రజలు తల దించుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లతోనే పార్టీ అభ్యర్థులు గెలిచారని, తమకు ఏ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఓట్లు వేయలేదని వెల్లడించారు.
రేవంత్ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వాయిదా
ఓటుకు నోటు కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన రేవంత్రెడ్డిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రేవంత్ తరపు న్యాయవాదులకు కౌంటర్ దాఖలుకు కోర్టు రేపటి వరకు సమయమిచ్చింది.
రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు విషయంలో మరిన్ని విషయాలు వెల్లడి కావాల్సి ఉందని, అందుకు రేవంత్తో పాటు, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసింది. రేవంత్ నుండి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని చెప్పారు.
రేవంత్ రెడ్డి ఈ డీల్లో అనేకమందితో మాట్లాడినట్లు తెలుస్తోందని ఏసీబీ పేర్కొంది. ఏయే ప్రాంతాల్లో ఈ నిందితులు కలుసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారో తెలియాల్సి ఉంది. మత్తయ్య పరారీలో ఉన్నారని, ఆయనను విచారించాల్సి ఉందని చెప్పారు. అరెస్టు చేశాక రేవంత్ను విచారించేందుకు సమయం సరిపోలేదని పేర్కొన్నారు.
టీడీపీ కార్యకర్తలు ఏసీబీ కార్యాలయానికి వచ్చి హంగామా చేశారన్నారు. ఆ పరిస్థితుల్లో నిందితులను విచారించడం సాధ్యం కాలేదన్నారు. వారి నుండి పలు ఆధారాలు రాబట్టాలన్నారు. డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు సమకూర్చారనేది తెలుసుకోవాల్సి ఉందన్నారు. రూ.50 లక్షలు అప్పుడే ఇస్తామని, మిగతా రూ.4.5 కోట్లు తర్వాత ఇశ్తామని చెప్పారన్నారు. దీనిపై తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఆ నాలుగున్నర కోట్లు ఎక్కడున్నాయో గుర్తించాల్సి ఉందని చెప్పారు.