27శాతమే, టిడిపికి 4రోజుల సంతోషం: జగన్పార్టీ లాజిక్
హైదరాబాద్: సీమాంధ్రలో మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జోరు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆసక్తికరంగా స్పందించింది. ఈ ఫలితాలు తాము ఊహించినవేనని, ఈ ఫలితాలు సీమాంధ్ర మొత్తానికి సంబంధించి కాదని, కేవలం 27 శాతం ప్రజల తీర్పు మాత్రమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గట్టు రామచంద్ర రావు ఓ టీవి ఛానల్తో మాట్లాడుతూ చెప్పారు.
ఈ ఫలితాలను తాము తమ పార్టీకి ప్రతికూలం అనుకోవడం లేదన్నారు. పుర ఫలితాల్లో టిడిపి గెలుపును తాము ముందే ఊహించామన్నారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ వ్యతిరేక శక్తులను కూడకట్టుకొని ఎన్నికలకు వెళ్లారని చెప్పారు. 16వ తేదీన ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని చెప్పారు.
మున్సిపాలిటీ ఫలితాలు కేవలం సీమాంధ్రలోని 27 శాతం ప్రజల తీర్పు మాత్రమే అన్నారు. తమకు పట్టణ ప్రాంతంలో అంత పట్టు లేదన్నారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికల విజయావకాశాలను గ్రామీణ ప్రాంతం నిర్ణయిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో తమ పార్టీకే బలం ఉందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల గెలుపు చూసుకుంటే టిడిపికి, తమకు పెద్దగా తేడా లేదన్నారు. అర్బన్ ప్రాంతంలో తమకంటే వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని తాము ముందే భావించామన్నారు. ఇవి కేవలం 27 శాతం ప్రజలు ఇచ్చిన తీర్పేనని, వంద శాతం కాదన్నారు. అదీ పట్టణ తీర్పు అన్నారు. తమకు గ్రామాల్లో మంచి పట్టు ఉందన్నారు.
తమది కొత్త పార్టీ అని, కాబట్టి పట్టణ ప్రాంతంలో అర్బన్ ఓట్లు వేయించుకోలేకపోయామన్నారు. వారు తమ వైపుకు రావాలంటే ఏం చేయాలో సమీక్షించుకుంటామని చెప్పారు. నేటి (మున్సిపల్), రేపటి (పంచాయతీ) ఫలితాలు తమకు అనుకూలం కాకపోయినా 16వ తేదీ ఫలితాలు మాత్రమే తమకే అనుకూలంగా ఉంటాయని చెప్పారు. 16వ తేదీన టిడిపి ఎలాగు ఓడిపోతుందని, అప్పటి వరకు నాలుగు రోజుల పాటు వారు సంతోషపడేందుకు ఓ కారణం దొరికిందని ఎద్దేవా చేశారు.