కాల్ మనీపై ఒత్తిళ్లా: సెలవులపై సవాంగ్, బాబు వచ్చినా ఏం చేయలేరని బెదిరింపు
విజయవాడ: కాల్ మనీ అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇలాంటి సమయంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుల పైన వెళ్తున్నారు. వారం రోజుల పాటు సెలవు కావాలని ఆయన ఉన్నతాధికారులను అడిగారు.
దానిని పరిశీలించిన అధికారులు వెంటనే సెలవులు మంజూరు చేశారు. గౌతమ్ సవాంగ్ స్థానంలో నగర ఇంఛార్జ్ సీపీగా సురేంద్ర బాబు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. కాగా, గౌతమ్ సవాంగ్ సెలవుల పైన వెళ్లడానికి కాల్ మనీ వ్యాపారుల నుంచి రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్లే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, గౌతమ్ సవాంగ్కు ప్రభుత్వం గత నెల 24వ తేదీనే లీవ్ ఇచ్చిందని చెబుతున్నారు. అతను అంతకుముందే సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాల్ మనీ కేసుకు దీనికి సంబంధం లేదని అంటున్నారు. గౌతమ్ సవాంగ్ 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు సెలవులో ఉంటారు. సవాంగ్ తన కుటుంబ సభ్యులతో ఆస్ట్రేలియాతో వెళ్తున్నారు.
మరోవైపు, కాల్ మనీ విషయంలో ఏపీ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. దీంతో, పోలీసులు చాలాచోట్ల విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. టిడిపి నేతలను కూడా పోలీసులు వదలడం లేదు. బెజవాడలోనే 92 ఫైనాన్స్ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, బ్లాంక్ చెక్కులు స్వాధీనం చేసుకుంటున్నారు.
చంద్రబాబు వచ్చినా ఏం చేయలేరు!
కాల్ మనీ బాధితులు ఒక్కరొక్కరు పోలీసుల వద్దకు వరుస కడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఎవరు వచ్చినా తమను ఏం చేయలేరని కాల్ మనీ దందా చేసేవారు బాధితులను బెదిరిస్తున్నారు.
ఇందుకు సంబంధించి ఆడియోలు కలకలం రేపుతున్నాయి. ఓ బాధితురాలు కాల్ మనీ దందా చేసే వ్యక్తికి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా.. అతను ఆమెకు ఫోన్ చేసి బెదిరించాడు. చంద్రబాబు వచ్చినా తమను ఏం చేయలేడని కాల్ మనీ దందా చేసే వ్యక్తి ఫోన్లో బెదిరించాడు.