ఆలయాలపై దాడులు దుష్ప్రచారం చేస్తుంది వారే .. ఆ నేరాలకు పీడీ యాక్ట్ : డీజీపీ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఆలయాల పై జరుగుతున్న దాడులపై, విగ్రహ విధ్వంసం ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై సామాజిక , ప్రసార మాధ్యమాలలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Recommended Video
ఇది ఒక హెచ్చరిక అందుకే ఈ నెల 17 నుండి .. రామతీర్థంలో చినజీయర్ స్వామి ఆసక్తికర ప్రకటన
తొమ్మిది కేసుల్లో పలు రాజకీయ పార్టీల నేతలు నేరుగా ప్రమేయం ఉందన్న డీజీపీ
రాజకీయ పార్టీలు ఆలయాలపై దాడులను దుష్ప్రచారం చేస్తున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తప్పుబట్టారు. తొమ్మిది కేసుల్లో పలు రాజకీయ పార్టీల నేతలు నేరుగా ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించామని పేర్కొన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇప్పటి వరకూ పలు ఘటనలలో 15 మందిని అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు . సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న డిజిపి, సోషల్ మీడియా పోస్టులపై సీరియస్ గా వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు.
మతాల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
మతాల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నఆయన ఆలయాలపై దాడులకు సంబంధించి పోస్టులు పెడుతున్న పాస్టర్ వ్యవహారంపై సీఐడీ విచారణ చేస్తోందంటూ వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే ప్రస్తుతం తక్కువగానే సంఘటనలు జరుగుతున్నాయని ఏపీలో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలపై ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభినందనలు అనుకుంటున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.
పదే పదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతాం
దేవాలయాలకు సంబంధించి 29 కేసులను ఛేదించి 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్తులను, ముఠాలను అరెస్ట్ చేశామని ఆయన స్పష్టం చేశారు. తరచూ ఆలయాలపై దాడులకు పాల్పడినా, నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఆలయాలపై దాడులకు సంబంధించి పోస్టులు పెట్టినా, వాటిని షేర్ చేసినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,296 ఆలయాల వద్ద సెప్టెంబర్ కు ముందు 44,521 సీసీ కెమెరాలు, సెప్టెంబరు తరువాత 31 216 కెమెరాలు ఏర్పాటు చేశామని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ప్రచారానికి చెక్ పెట్టేలా డీజీపీ వ్యాఖ్యలు
అంతేకాదు పోలీసు భద్రత తో పాటుగా ఆలయ కమిటీలను సమావేశ కమిటీలను సమన్వయం చేస్తూ ప్రణాళికాబద్ధంగా హిందూ ఆలయాలను కాపాడడం కోసం పోలీస్ శాఖ పనిచేస్తోందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది ప్రచారం చేస్తే తీవ్ర నిర్ణయాలకు వెనుకాడమని డీజీపీ స్పష్టం చేశారు .