జగన్ ఆగ్రహం, తగ్గిన గౌతం రెడ్డి: వ్యాఖ్యల తొలగింపు, ఏ పార్టీ తీసుకోకపోవచ్చు!
వివాదాస్పద వ్యాఖ్యలతో విజయవాడలో ఉద్రిక్తతకు కారణమైన వైసిపి బహిష్కృత నేత గౌతం రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఛానల్లో గౌతంరెడ్డి ఇంటర్వ్యూ ప్రసారమైంది.
విజయవాడ: వివాదాస్పద వ్యాఖ్యలతో విజయవాడలో ఉద్రిక్తతకు కారణమైన వైసిపి బహిష్కృత నేత గౌతం రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఛానల్లో గౌతంరెడ్డి ఇంటర్వ్యూ ప్రసారమైంది.
అభ్యర్థన మేరకు వివాదాస్పద వ్యాఖ్యల తొలగింపు
గౌతం రెడ్డి అభ్యర్థన మేరకు వివాదాస్పద వ్యాఖ్యలను ఇంటర్వ్యూ నుంచి తొలగించారు. ఇంటర్వ్యూ కాసేపటిలో ముగుస్తుందనగా గౌతం రెడ్డి మాట్లాడుతూ తన వ్యాఖ్యలను అన్యదా భావించవద్దని రంగా అభిమానులను కోరారు.
మీడియా ముందుకు వచ్చే అవకాశం
తన వ్యాఖ్యలు రంగా అభిమానులను బాధించి ఉంటే మరోలా భావించవద్దని వేడుకున్న గౌతం రెడ్డి, మీడియా ముందుకు కూడా వచ్చే అవకాశముందని తెలుస్తోంది. రంగా, ఆయన సోదరుడు రాధా హత్యలపై ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతం రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
జగన్ ఆగ్రహానికి గురయ్యారు
అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఆదివారం రాధాకృష్ణ, ఆయన అనుచరులు విజయవాడలో ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో స్పందించిన వైసిపి అధినేత జగన్ పార్టీ నుంచి గౌతం రెడ్డిని సస్పెండ్ చేశారు.
బెజవాడలో టెన్షన్
మరోవైపు, వంగవీటి రాధాకృష్ణ, ఆయన అనుచరులు కూడా విజయవడలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గౌతమ్ రెడ్డి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రంగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనను పార్టీలోకి తిరిగి తీసుకోవద్దని వంగవీటి రాధా కోరుతున్నారు.
గౌతం రెడ్డికి ఎంట్రీ ఉంటుందా?
గౌతం రెడ్డి పార్టీ మారేందుకే, ముఖ్యంగా బిజెపిలో చేరేందుకే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంతో ఆయనను పార్టీలోకి తీసుకునేందుకు బిజెపి ససేమీరా అంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాపులు వివిధ అంశాలపై ఉద్యమిస్తున్న ఇలాంటి సమయంలో ఆయనను ఏ పార్టీ చేర్చుకునే అవకాశం లేదంటున్నారు.