వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు: వైసిపి నేత సంచలనం, జగన్ ఆగ్రహం, షోకాజ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా నాయకుడు గౌతమ్ రెడ్డి దివంగత వంగవీటి రంగాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగాను చంపడం దారుణం ఏమిటని అభిప్రాయపడ్డారు
Recommended Video
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా నాయకుడు గౌతమ్ రెడ్డి దివంగత వంగవీటి రంగాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగాను చంపడం దారుణం ఏమిటని అభిప్రాయపడ్డారు.
ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి... 'ఆ రోజు వంగవీటి రంగాను చంపడం కూడా దారుణం కదా' అని ప్రశ్నించారు.
రంగాను చంపడం దారుణం ఏమిటన్న గౌతమ్ రెడ్డి
దానికి గౌతమ్ రెడ్డి సమాధానం చెప్పారు. 'రంగా, రాధను చంపడం దారుణం ఏమిటి. నేను ఉదాహరణ చెబుతాను. దానికి సమాధానం చెప్పు' అని చెప్పడం ప్రారంభించారు.
పాము కథ చెప్పిన గౌతమ్ రెడ్డి
ఓ పాము బయలుదేరి వెళ్తూ దొరికినోడినల్లా కాటు వేస్తూ చంపుకుంటూ వెళ్తోందని, అది అలా వెళ్తూ ఓ దేవుడి ఫోటో వెనక్కి వెళ్లి దాక్కుందని చెప్పారు. దేవుడి ఫోటో వెనుక ఉంది కదా అని చెప్పి సమాజం ఆ పామును చంపకుండా ఉంటుందా అని ప్రశ్నించారు.
అలాంటి వాళ్లు పోస్టుమార్టంకు వెళ్లాల్సిందే
అంతే, నిరాహార దీక్షలో ఉన్నా, ఎక్కడ ఉన్నా రౌడీ రాజకీయాలే పరమావధిగా భావించి అడుగులు ముందుకు వేసే వాళ్ల భవిష్యత్తు పోస్టుమార్టంకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. రౌడీయిజంను వదులుకొని మాలాగ సజావుగా రాజకీయాల్లోకి రావాలని గౌతమ్ రెడ్డి అన్నారు.
అప్పుడే కుల రాజకీయాలని..
వంగవీటి రంగా అలా వదులుకొని వచ్చే, ప్రజా సమస్యలపై నిరాహార దీక్ష చేస్తుంటే చంపేశారని సదరు ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. దానికి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. వాళ్లు వచ్చాక కమ్యూనిస్టు పార్టీలతో రాజీ చేసుకున్నాక కుల రాజకీయాలు బయటకు వచ్చాయన్నారు. రెండు కుల రాజకీయాలకు సంబంధించి ఒకరు ఒక కులానికి, మరొకరు మరో కులానికి, వాళ్లు నలుగురిని చంపితే, వీళ్లు నలుగురిని చంపారని, కమ్యూనిస్టు రాజకీయాలు అప్పటికి ఆగిపోయాయన్నారు.
గౌతమ్ రెడ్డికి వైసిపి షోకాజ్
వంగవీటి రంగాపై తమ పార్టీ నేత పూనురు గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసిపి ఆదివారం ఖండించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మా పార్టీకి సంబంధం లేదు
గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలతో వైసిపికి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఆయనవి వ్యక్తిగతమైనవని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలు ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
వైయస్ రాజశేఖర రెడ్డికి వంగవీటి రంగా మంచి స్నేహితుడు అని పార్థసారథి అన్నారు. రంగాను తాము ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటామని చెప్పారు. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై తమ పార్టీ అధినేత జగన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. మొత్తానికి వైసిపి నేత గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చిచ్చు రేగింది.