కుదిపేస్తున్న కాల్ మనీ స్కామ్: చంద్రబాబుకు సవాంగ్ నివేదిక
హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారం రాష్ట్ర శాసనసభను కుదిపేస్తున్న తరుణంలో విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నివేదిక సమర్పించారు. గౌతమ్ సవాంగ్ గురువారంనాడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన ఐజి ఠాకూర్తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుతో సమావేశమయ్యారు.
కాల్ మనీ వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధపడింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఫైనాన్షియర్ల ఆగడాలను అరికట్టడానికి మనీ ల్యాండరింగ్ చట్టాన్ని తేవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు రేపు శుక్రవారం శాసనసభలో కాల్ మనీ వ్యవహారంపై ప్రకటన చేయనున్నారు. కాల్ మనీ వ్యవహారంపై గురువారం శాసనసభ దద్ధరిల్లింది. ఈ వ్యవహారంపై వెంటనే సభలో చర్చించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టుబట్టడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. కాగా, రేపు కూడా సభ సజావుగా సాగుతుందా అనేది అనుమానంగానే ఉంది.
రేపు శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం జరిగింది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు మంత్రులతో, శాసనసభ్యులతో చర్చించి, వారికి మార్గదర్శనం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఎదురుదాడికి దిగాలని ఆయన సూచించినట్లు అర్థమవుతోంది.
కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా గురువారం సాయంత్రం తన శాసనసభ్యులతో సమావేశమయ్యారు. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ఆయన శాసనసభ్యులకు సూచించినట్లు సమాచారం.