ఢిల్లీ ఘటనపై మనస్తాపం: గీతారెడ్డి రాజీనామా?
బుధవారం మౌన దీక్ష కోసం జంతర్మంతర్కు బయలు దేరిన ముఖ్యమంత్రిని నిలువరించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహిళా మంత్రుల పట్ల భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల గీతారెడ్డి బాధపడ్డారు.. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ జరగలేదని ఆమె ఆవేదనలో మునిగారు. ఇంత జరిగిన తర్వాత కూడా మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.
ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, రాష్ట్రపతి సైతం ఘటనపై విచారణ వ్యక్తంచేసినా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కనీస మర్యాదకైనా మహిళా మంత్రులను సంప్రదించి విచారం వ్యక్తం చేయకపోవడాన్ని తెలంగాణ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఆ సంఘటనపై, తాను రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై గీతారెడ్డి ఓ ప్రముఖ తెలుగు దినపత్రికతో మాట్లాడారు. బుధవారం నాటి ఘటనతో తాను మనస్తాపానికి గురయ్యానని ఆమె ఆంధ్రజ్యోతితో అన్నారు. ఇంకా మంత్రి పదవిలో కొనసాగరాదని పలువురు నేతలు, నియోజకవర్గ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్న మాట కూడా వాస్తవమేనని వివరించారు.
దీనిపై అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్టీలో సీనియర్ నాయకురాలిగా తనను చూసిన వెంటనే కిరణ్ బస్సు దిగుతారని, తమతో మాట్లాడతారని ఊహించామని, కానీ ఇందుకు భిన్నంగా జరిగిందని అన్నారు.