విద్యార్థుల ఆత్మహత్యపై వ్యాఖ్యలు: జగన్ను ఏకేసిన గంటా
హైదరాబాద్: కడపలో విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు. కడపలో విద్యార్థుల మృతిపై జగన్ శవ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
విద్యార్థుల మృతిపై విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని గంటా చెప్పారు. విద్యార్థుల మృతిని కూడా రాజకీయం చేయాలనుకోవడం జగన్ అవగాహనా రాహిత్యానికి నిదర్శమని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలేవి లేకపోవడంతో జగన్ ఈ పోకడలకు తెర లేపుతున్నారని గంటా అన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలను ఉపేక్షించేదిలేదని మంత్రి స్పష్టం చేశారు.
కడప జిల్లాలోని నారాయణ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనపై త్రిసభ్య కమిటీని నియమిస్తూ గంటా శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు.
కమిటీ సభ్యులుగా పద్మావతి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ విజయలక్ష్మి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్ట్రోలర్ మాణిక్యం, కడ డిఆర్వోలు వ్యవహరిస్తారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ గంటా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదిలావుంటే, విద్యార్థినుల ఆత్మహత్యలను జగన్ రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శించారు. మంగళవారం ఆయన ఓ ప్రముఖ టీవీ చానెల్తో ప్రత్యేకంగా మాట్లాడారు.
విద్యార్థినుల ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆయన తెలిపారు. నారాయణ కాలేజీల్లో సీఎంకు వాటా ఉందనడం హాస్యాస్పదమన్నారు. వ్యాపార భాగస్వామ్యాల గురించి జగన్కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని సీఎం రమేష్ ఎద్దేవా చేశారు.
కడపలోని నారాయణ కళాశాల హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో బాధితులను జగన్ పరామర్శించి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, మంత్రి నారాయణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.