జగన్ యువభేరీకి హాజరైన ప్రొఫెసర్లపై చర్యలకు ఆదేశాలు ఇవ్వలేదు, కానీ...: గంటా
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి యువభేరీకి హాజరైన ఏయూ ప్రొఫెసర్లపై చర్యలకు ఆదేశాలు ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల నిబంధనల ప్రకారం వీసీ చర్యలు తీసుకుంటారని తెలిపారు.
అక్టోబర్ 12న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల విశాఖలో యువభేరీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇది ఆంధ్రా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిని చిక్కుల్లో పడేసింది.
ప్రసాద్ రెడ్డి పైన సస్పెన్షన్ వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. విశాఖలోని కళావాణి పోర్టు స్టేడియంలో ఇటీవల జగన్ యువభేరి సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు విద్యార్థులతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో, కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు ఏయూ వీసీ ఆచార్య జిఎన్ఎన్ రాజు ప్రశ్నించారు. నాటి సదస్సుల్లో వర్శిటీకి చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు పాల్గొన్నారని తెలిసిందని, వారిని సస్పెండ్ చేస్తారా? లేదా నోటీసు ఇస్తారా? అని మంత్రి అడిగారు.