జైలుకు గంటా తనయుడు: అంజన్ తనయుడి దాడి
హైదరాబాద్: రాజకీయ నాయకుల కుమారులు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం ప్రస్తుత నాయకుడు గంటా శ్రీనివాస రావు కుమారుడు రవితేజ శంషాబాద్ విమానాశ్రయంలో వీరంగం సృష్టించాడు. అతనితో పాటు అతని మిత్రుడు ఇంద్రజిత్ కూడా ఈ వీరంగంలో తన వంతు పాత్ర నిర్వహించాడు. గంటా తనయుడు రవితేజను, అతని మిత్రుడు ఇంద్రజిత్ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వారిద్దరికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో వారిని పోలీసులు హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు.
వారు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. రవితేజ, ఇంద్రజిత్ విమానాశ్రయంలోని ఓ ప్రైవేట్ బార్పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పుష్పక్ బస్సు డిపో కంట్రోలర్పై దాడి చేసి వీరంగం సృష్టించారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, హైదరాబాదులోని పాతబస్తీ హుస్సేనీ ఆలంలో ఓ పోలీసు కానిస్టేబుల్పై సికింద్రాబాద్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్ తన ప్రతాపం చూపించాడు.
రోడ్డుపై హోలీ వేడుకలు ఎందుకు నిర్వహిస్తున్నారని అడిగినందుకు కానిస్టేబుల్పై అరవింద్ యాదవ్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతోందని కానిస్టేబుల్ చెప్పడమే తప్పయిపోయిందని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు అరవింద్ కుమార్పై కేసు నమోదు చేశారు.