ఫలించని బుజ్జగింపు, జగన్కు రాజీనామా పంపిన ఆదిశేషగిరిరావు: ఆయన ద్వారా టీడీపీలోకి
అమరావతి: ప్రముఖ సినీ నటుడు కృష్ణ సోదరుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. గతంలోను ఆయన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. మంగళవారం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.
జగన్కు ఆదిశేషగిరిరావు షాక్, ఎటువైపు?: వారంతా జనసేన వైపు చూస్తున్నారు కానీ!
జగన్ను కలిసి రాజీనామా
ఆదిశేషగిరి రావు మంగళవారం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు. వైయస్ రాజశేఖర రెడ్డికి, ఆ తర్వాత జగన్కు సన్నిహితంగా ఉన్నారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన, ఆ తర్వాత జగన్ వైసీపీ పెట్టాక ఇందులో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తుండగా జగన్ మాత్రం విజయవాడ నుంచి పోటీ చేయమని చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారట.
బుద్ధా వెంకన్న ద్వారా టీడీపీలోకి
ఆదిశేషగిరి రావు పార్టీ వీడుతారని తెలియగానే వైసీపీ సీనియర్ నేతలు రంగంలోకి దిగి ఆయనతో చర్చించారని తెలుస్తోంది. తనకు కేటాయించే సీటుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పార్టీ నుండి వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, ఆదిశేషగిరి రావు టీడీపీలో చేరనున్నారు. తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ద్వారా ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
అప్పుడే కాదు, సంక్రాంతి తర్వాత చేరిక
ఆదిశేషగిరి రావు వైసీపీని వీడినప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సమయం తీసుకోనున్నారని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ అనంతరం కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి టీడీపీలో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నారట. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు.