నాగార్జునకు షాక్ తప్పదా?: కన్వెన్షన్కు త్వరలో నోటీస్
హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్కు సాధ్యమైన త్వరలో నోటీసులు ఇస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ బుధవారం తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ స్పందించింది. త్వరలో ఎన్ కన్వెన్షన్కు నోటీసులు ఇస్తామని తెలిపింది. ఇందుకోసం న్యాయసలహాలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కాగా, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో జీహెచ్ఎంసీకి ఎదురు దెబ్బ తగలగా... ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి బుధవారం ఊరట లభించిన విషయం తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన విచారణ బుధవారం ముగిసింది.
యాజమాన్యానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టవద్దని హైకోర్టు అధికారులను ఆదేశించింది. నోటీసులు ఇచ్చాకే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చర్యలకు ముందు నోటీసులు ఇవ్వాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు సూచించింది. ఎన్ కన్వెన్షన్ సమీపంలోని తుమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)ను నిర్ధేశించాలని న్యాయస్థానం సూచించింది.
నోటీసులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారం జీహెచ్ఎంసీకి ఉందని అడ్వోకేట్ జనరల్ చెప్పగా... చట్టం ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు హితవు పలికింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.