నాగార్జున 'కన్వెన్షన్'పై చర్యకు కసరత్తు, న్యాయసలహా
హైదరాబాద్: సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన చర్యకు హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీని పైన చర్యకు ముందు అడ్వోకేట్ జనరల్ (ఏజీ) సలహా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.
ఈ మేరకు ముందుగా నిర్మాణదారునికి నోటీసు ఇచ్చి ఎఫ్టీఎల్ను శాస్త్రీయంగా నిర్ధారించాక, చర్యలు తీసుకోవచ్చునని ఏజీ సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏజీ న్యాయ సలహాకు అనుగుణంగా నిర్మాణం పైన చర్యలు తీసుకోవడానికి జీహెచ్ఎంసీ యోచిస్తోంది.
హైటెక్ సిటీ దగ్గరలో గతంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటరును నిర్మించారు. ఈ భూమి గురుకుల్ ట్రస్టుదని జీహెచ్ఎంసీ చెబుతోంది. పైగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్కడి సమీపంలోనే ఉన్న తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి నిర్మామం మొత్తం అక్రమేనని చెబుతున్నారు.
గురుకుల్ ట్రస్ట్ స్థలాల్లో నిర్మించిన కొన్ని అక్రమ నిర్మాణాలను ఇటీవల జీహెచ్ఎంసీ కూల్చివేయడం తెలిసిందే. ఇదే సమయంలో అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటరు పైన చర్యలకు సిద్ధమయ్యారు. సర్వే చేసి, ఈ భవనంలో కొంత భాగం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తేల్చారు. ఇది అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ అధికారులు భవనం కోడల పైన రాశారు. నిర్మాణంపై చర్యలకు అధికారులు సిద్ధమవడంతో యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
చర్యలు తీసుకునేటప్పుడు యాజమాన్యానికి నోటీసు ఇచ్చి ఆ తర్వాత ముందుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ పైన చర్యలకు వీలుగా ఏజీ ఇచ్చిన న్యాయసలహాను, సాగునీటి, రెవెన్యూ శాఖలకు రెండు రోజుల్లో పంపించనున్నారు. నిర్మాణంపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.