జగన్ కోసం ఎమ్మెల్యే పాదయాత్ర :100 మందికి పైగా మొక్కులు: సీఎం ఇవ్వబోతున్న గిఫ్ట్ అదే..!!
ఏపీకి జగన్ ముఖ్యమంత్రి అయితే తాను తిరుమలకు కాలినడకన వస్తానని మొక్కుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకొనేందుకు బయల్దేరారు. ఆయన అప్పటి నుండి పెంచిన తల నీలాలు.. గడ్డం సైతం తిరుమలలో తీయనున్నారు. ఆ ఎమ్మెల్యేతో పాటుగా 100 మందికి పైగా తలనీలాలు ఇచ్చేందుకు పాదయాత్రలో చివరి వరకు పాల్గొంటున్నారు.
దాదాపు 15 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగనుంది. అసెంబ్లీలో సైతం చంద్రబాబు హాయంలో సాగిన పార్టీ ఫిరాయింపుల మీద ఫైర్ అయిన ఆ ఎమ్మెల్యే సభలోనే తన పాదయాత్ర గురించి ప్రకటించారు. తనకు ఎటువంటి పదవులు అవసరం లేదని .. చంద్రబాబు పైన చర్యలు తీసుకోకపోతే ఆయన ఇంటి వద్ద ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. అయితే..ముఖ్యమంత్రి జగన్ ఈ ఎమ్మెల్యేకు కీలక పదవి ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం.
నిరంతరం పని చెయ్యాల్సిన చోట గ్రామీణాభివృద్ధికి 30 రోజుల కార్యాచరణ ఎందుకు ? ప్రజల్లో , అధికారుల్లో
గిద్దలూరు ఎమ్మెల్యే పాదయాత్ర..
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. బుధవారం అర్థవీడు మండలం కాకర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్రగా రాంబాబు బయలుదేరనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరిస్తే తిరుమలకు కాలినడకన వస్తానని ఎమ్మెల్యే రాంబాబు మొక్కుకున్న నేపథ్యంలో పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన వెంట పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, అభిమానులు పాదయాత్రలో తిరుమలకు వెళ్లనున్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో గల ప్రధాన మార్గాల గుండా కడప జిల్లాలోకి వెళ్ళి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించి తిరుమలకు వెళ్లనున్నారు. సుమారు 15 రోజులపాటు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిసింది. తిరుమలలో ఆయన తలనీలాలు, ఆయనతోపాటు 100 మందికి పైగా తలనీలాలు ఇచ్చేందుకు పాదయాత్ర చివరి వరకు చేయనున్నట్లు తెలిసింది. రాంబాబు తాజా ఎన్నికల్లో గిద్దలూరు నుండి గెలిచారు. ఆయన తాజాగా జరిగిన శాసనసభా సమావేశాల్లోనే తన తిరుమల యాత్ర గురించి ప్రకటించారు. తాను మొక్కుకున్న విధంగానే కాలి నడకన తిరుమలకు చేరుకొని..అప్పటి నుండి పెంచుతున్న తల నీలాలు స్వామికి సమర్పిస్తానని ప్రకటించారు.
జగన్ తరువాత మెజార్టీ ఆయనదే...
తాజాగా జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ది 175 మంది ఎమ్మెల్యేల్లో అత్యధిక మెజార్టీ. కాగా రెండో మెజార్టీ సాధించిన వ్యక్తిగా గిద్దలూరు నుండి గెలిచిన అన్నా రాంబాబు నిలిచారు. 2009లో రాంబాబు ప్రజారాజ్యం నుండి గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత టీడీపీలో కొనసాగిన రాంబాబు తన పైన గెలిచిన అభ్యర్ధిని టీడీపీలోకి తీసుకోవటం ద్వారా ఆయన పార్టీ వీడాలని నిర్ణయించారు. అదే సమయంలో పార్టీ మారాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో గిద్దలూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ మొత్తం 151 సీట్లు గెలవగా.. అందులో అత్యధిక మెజార్టీ జగన్ ది కాగా.. రెండో భారీ మెజార్టీ సాధించిన వ్యక్తిగా రాంబాబు నిలిచారు. టీడీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. చంద్రబాబు ఓడి..జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని పలు సందర్భాల్లో రాంబాబు చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కావటంతో ఇప్పుడు రాంబాబు తన మొక్కు చెల్లించుకొనేందుకు సిద్దమయ్యారు. ఆయన పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు.
చంద్రబాబు పైన కేసులు..పోరాటం..
ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఫిరాయింపుల ద్వారా టీడీపీలోకి తీసుకోవటం..నలుగురికి మంత్రి పదవులు ఇవ్వటం పైన అన్నా రాంబాబు పోరాటం చేసారు. రాష్ట్రపతి మొదలు అనేక మందికి ఫిర్యాదులు చేసారు. కోర్టు కేసులు సైతం దాఖలు చేసారు. అయినా తనకు న్యాయం జరగలేదని అన్నా రాంబాబు శాసనసభలో వాపోయారు. పార్టీ ఫిరాయింపుల మీద తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రత్యేకంగా ఆయన స్పీకర్ ను అభ్యర్ధించారు. ఫలితంగా స్పీకర్ ఆయనకు సమయం ఇచ్చారు. ఆ సమయంలో ఆయన టీడీపీలో ఎదుర్కొన్న అవమానాలను వివరించారు. టీడీపీ హాయంలో జరిగిన పార్టీ ఫిరాయింపులకు బాధ్యుడైన చంద్రబాబు మీద చర్యలు తీసుకోకుంటే ఆయన ఇంటి ముందు ఆమరణ దీక్ష చేస్తానని రాంబాబు సభలోనే హెచ్చరించారు. ఇక, ఇదే సమయంలో ప్రకాశం జిల్లా నుండి రాంబాబుకు టీటీడీ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.