నాపైనా అక్రమ కేసులు, అందుకే రోజా సస్పెన్షన్: ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్ను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని ఆమె చెప్పారు. కాల్ మనీ వ్యవహారం గురించి ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని ఆమె విమర్శించారు. ఉద్దేశ్యపూర్వకంగానే రోజాను సస్పెండ్ చేశారని ఆమె అభిప్రాయపడ్డారు.
ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు లేకున్నా రోజాపై నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు. పోలీసులు రోజా పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆమె అ్నారు. ఆమెకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆమె హెచ్చరించారు. తనపై కూడా అక్రమ కేసులు పెట్టారని ఆమె అన్నారు.
రాష్ట్రంలోని ప్రజా సమస్యలు టిడిపి ప్రభుత్వానికి పట్టడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో టిడిపి అనుసరిస్తున్న వైఖరిపై ఆయన శనివారం మీడియా సమావేశంలో మండిప్డడారు. రైతులు, అంగన్వాడీలు, డ్వాక్రా గ్రూపుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన విమర్శించారు.
ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఇష్టారాజ్యంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. సభలోనే అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఏ మేరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. రాజధాని పేరుతో ఒకే చోట అధికారాన్ని కేంద్రీకరిస్తున్నారని ఆయన అన్నారు.