ఎన్టీఆర్ తర్వాత.. ఇప్పుడు వైఎస్ జగన్: గిరిబాబు ప్రశంసలు, నాశనమేనంటూ చంద్రబాబుపై నిప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీనియర్ సినీ నటుడు గిరిబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ సర్కారుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.
కరోనా లాక్డౌన్: నలుగురిలో ఒకరు నిరుద్యోగులుగా, రూరల్ కంటే పట్టణాల్లోనే ఎక్కువ
రామారావు తర్వాత ఆయనే.. ఇప్పుడు జగన్..
రామారావు తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నది వైఎస్ జగన్. ఆయన చేసిందేమీ లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీది కడుపుమంట తప్ప మరోటి కాదు. జగన్ పాలనను చూసి ఓర్చుకోలేక చేస్తున్న దురాగతం, దుష్ప్రచారం తప్ప ఇంకోటి కాదు. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాలించినవాళ్లు ఏమీ చేయలేక రాష్ట్రాన్ని దిక్కుమొక్కు లేకుండా చేశారని చంద్రబాబునుద్దేశించి గిరిబాబు విమర్శలు గుప్పించారు.
15ఏళ్లపాటు జగనే సీఎం..
ఇలాంటి వాళ్ల(టీడీపీ)కు జనం గట్టిగానే బుద్ధి చెప్పారంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు గిరిబాబు. ఆ ఉక్రోశం తట్టుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మళ్లీ జగనే సీఎం అవుతారు. మరో 15ఏళ్లపాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇంకా ఎక్కువ ఏళ్లు సీఎంగా ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని గిరిబాబు అన్నారు. మళ్ళీ జగన్ సీఎం అవుతారని అనడంలో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ దుర్మార్గపు పాలన వల్లే..
ఇక టీడీపీ పని అయిపోయిందని, ఆ పార్టీ బతికి బట్టకట్టడం అనేది అసాధ్యమేనని అన్నారు. టీడీపీ వాళ్లు చేసిన దుర్మార్గ పరిపాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, అందుకే అంత దారుణంగా ఓడించారని గిరిబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో గిరిబాబు ఈ మేరకు వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమాని అయిన గిరిబాబు.. ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్కు మద్దతుగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం కూడా చేశారు.