విజయవాడ ప్రభుత్వాస్పత్రి దారుణం: బాలిక బతికుండానే చనిపోయిందని..
కృష్ణా: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకొచ్చిన సాయిదుర్గా అనే బాలికను.. బతికుకుండా చనిపోయిందంటూ శుక్రవారం రాత్రి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీళ్లపర్యంతమవుతూ ఇంటికి తీసుకెళ్లారు.
కాగా, శనివారం ఉదయం వరకు ఆమెను శవంగానే కిందపడుకోబెట్టారు. అయితే, శనివారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఆమెలో కదలికలను గమనించిన కుటుంబసభ్యులు తిరిగి సమీపంలోని పాయకర్ రావుపేట ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆ బాలికకు చికిత్స అందించేందుకు వారు విముఖత చూపారు.
ఆ తర్వాత గ్లోబల్ ఆస్పత్రికి తరలించినా.. అక్కడ కూడా తమ పాపకు వైద్యం అందించేందుకు వైద్యులు నిరాకరించారని ఆమె బంధువులు తెలిపారు. వారం రోజులుగా కోమాలో ఉందని చెప్పిన విజయవాడ ఆస్పత్రి వైద్యులు తమ పాపను బతికుండగానే చంపేశారని కన్నీటిపర్యంతమవుతున్నారు సాయిదుర్గా కుటుంబసభ్యలు.
ఇప్పుడు ఏ ఆస్పత్రిలోనూ పాపకు చికిత్స అందించేందుకు వైద్యులు అంగీకరించడం లేదని వారు పోయారు. ఓ ఆస్పత్రిలో పాప రెండు గంటల ముందు చనిపోయిందని అంటే మరో ఆస్పత్రిలో రెండు నిమిషాల ముందు చనిపోయిందంటున్నారని చెప్పారు.
తమ పాపను ఎలాగైనా బతికించాలని వేడుకుంటున్నారు. బాలిక తండ్రి 4నెలల క్రితమే చనిపోయాడని, ఇప్పుడు ఈ బాలికను బతికుండానే వైద్యులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. మరోవైపు ప్రభుత్వ వైద్యుల తీరును నిరసిస్తూ రాజరాజేశ్వరి పేటలో బాలిక బంధువులు ఆందోళనకు దిగారు.