ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: ర్యాగింగ్కు విద్యార్థిని బలి
కర్నూలు/కడప: కర్నూలు జిల్లా నంద్యాల ఆర్జీఎం కాలేజీలో ర్యాగింగ్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆ కాలేజీలో ఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉషారాణి హాస్టల్ గదిలోనే ఉరివేసుకుంది.
కడప జిల్లా బద్వేలుకు చెందిన ఉషారాణి కర్నూలు జిల్లా నంద్యాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలలో ర్యాగింగ్ వల్లే ఉషారాణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, కాలేజీలో సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని అనేక సార్లు జూనియర్లు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో తీవ్ర వేదనకు గురైన ఉషారాణి ఆత్మహత్య చేసుకుందని జూనియర్లు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, ఉషారాణి ఆత్మహత్య విషయాన్ని బయటకు చెబితే చర్యలు తీసుకుంటామని విద్యార్థినులను యాజమాన్యం బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మంత్రి గంటా ఆరా
ఉషారాణి ఆత్మహత్య ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.