భర్తకు అప్పటికే రెండు పెళ్లిళ్లు: నాగార్జునసాగర్లో దూకి భార్య ఆత్మహత్య
హైదరాబాద్: పెండ్లి కాలేదని నమ్మించి ఓ యువకుడు ఓ యువతిని మోసగించాడు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న భర్త మోసాన్ని గ్రహించిన బాధితురాలు కుటుంబ సభ్యుల ఎదుటనే డ్యాం మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన నాగార్జునసాగర్ వద్ద బుధవారం చోటుచేసుకున్నది.
యువతిని మోసగించిన నయవంచకుడు గుంటి రాజేశ్పై పలు కేసులు నమోదు చేసి ఇప్పటికే రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ చంపాపేటకు చెందిన అనుషారెడ్డి బుధవారం కుటుంబసభ్యులతో కలిసి నెల్లూరులో ఓ శుభకార్యానికి వెళుతున్నది. నాగార్జునసాగర్ వద్దకు చేరుకోగానే కారు ఆపాలని చెప్పింది.
కారు ఆగిన మరుక్షణమే కిందకు దిగిన అనుషారెడ్డి కారు బోనెట్ ఎక్కి ఒక్కసారిగా నదిలో దూకింది. వెంటనే స్థానికులు, మత్స్యకారులు నదిలోకి దూకి ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఆమె తల రాళ్లకు కొట్టుకోవడంతో అక్కడికక్కడే మరణించింది.
పోలీసుల కథనం ప్రకారం అనుషా రెడ్డి తన పేరున ఉన్న స్థలాన్ని గుంటి రాజేశ్ అనే వ్యక్తికి విక్రయించిన సందర్భంగా పెద్దఅంబర్పేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంలో గుంటి రాజేష్, అనూషతో మాటలు కలిపి ఆమె ఫోన్ నంబర్ను తీసుకున్నాడు. ఆ తర్వాత వారి మధ్య పరిచయం పెరిగింది. అది ప్రేమగా మారింది. అనూషను నమ్మించి గత అక్టోబర్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో వివాహం చేసుకున్నాడు.
పెండ్లి వ్యవహారాన్ని అనూష తల్లిదండ్రుల వద్ద గోప్యంగా ఉంచింది. అయితే తన భర్త రాజేష్కు అప్పటికే రెండు పెండ్లిండ్లు జరిగాయని అనూష తెలుసుకున్నది. తాను మోసానికి గురైనట్లు గ్రహించిన అనూష చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేష్పై ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), సెక్షన్ 376 (అత్యాచారం) కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తల్లిదండ్రులతోపాటు నెల్లూరు వెళ్తున్న అనూష నాగార్జునసాగర్ డ్యామ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంతకుముందే నిందితుడికి ఇద్దరితో వివాహం: 2003లో భారతిని, 2010లో రోమాసింగ్ను గుంటి రాజేశ్ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని రెండో భార్య రోమాసింగ్ సరూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎల్బీనగర్ ఆంజనేయస్వామి ఆలయానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న గుంటి రాజేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు పలు భూవివాదాల్లో ప్రమేయం ఉండటంతో హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
అనూష ఫిర్యాదు అందగానే కేసును నమోదు చేసుకుని గుంటి రాజేష్ను కేరళ రాష్ట్రం నుంచి పట్టుకొచ్చామని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నమస్తే తెలంగాణకు తెలిపారు. పాత కేసులపై విచారణ జరుపుతున్నామని, పూర్తి ఆధారాలు లభించిన తర్వాత రౌడీషీటు తెరుస్తామని స్పష్టంచేశారు. బాధితులు ఫిర్యాదులు చేస్తే.. పరిశీలించి రాజేష్పై పీడీయాక్ట్ను ప్రయోగిస్తామని సీవీ ఆనంద్ చెప్పారు.