'ఐ లవ్ యూ'రా బంగారం.. నీకు దూరమవుతున్న నీ మణి: కంటతడి పెట్టించిన లేఖ..
ఇక కల్యాణ్ తో తనకు పెళ్లికి జరగదని, తాను మోసపోయానని నాగమణి గ్రహించింది. రోజులు గడుస్తున్నా.. కల్యాణ్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇదే క్రమంలో గురువారం తెల్లవారుజామున
నిడదవోలు: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బావ.. తనను దూరం పెట్టేయడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా.. అతని నుంచి విముఖతే ఎదురవడంతో.. ఇక తనువు చాలించాలని నిర్ణయించుకుంది. చనిపోయే ముందు హృదయవిదారకంగా ఓ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తాళ్లపాలెంకు చెందిన పిల్లి బేబికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె నాగమణి(21) అట్లపాడుకు చెందిన కల్యాణ్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం పెద్దలకు తెలిసి.. పెళ్లికి కూడా అంగీకరించారు. పెళ్లి కూడా నిశ్చయం కావడంతో.. నాగరత్నం కుటుంబం కల్యాణ్ కుటుంబానికి రూ.74వేలు కట్నం కూడా ఇచ్చింది.
ఆశలు అడియాశలే:
ఇక పెళ్లి జరగడమే తరువాయి కావడంతో.. నాగమణి తన వైవాహిక జీవితంపై గంపెడాశలు పెట్టుకుంది. కల్యాణ్తో జీవితం గురించి ఊహా లోకంలో విహరిస్తున్న తరుణంలో.. నాగమణికి అనుకోని షాక్ తగిలింది. కల్యాణ్ తల్లిదండ్రులు నాగరత్నంతో పెళ్లికి విముఖత వ్యక్తం చేయడంతో.. కల్యాణ్ సైతం ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. నాగరత్నం ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఆమెతో మాట్లాడేందుకు కల్యాణ్ ఒప్పుకోలేదు.
మోసపోయానని గ్రహించి
ఇక కల్యాణ్ తో తనకు పెళ్లికి జరగదని, తాను మోసపోయానని నాగమణి గ్రహించింది. రోజులు గడుస్తున్నా.. కల్యాణ్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇదే క్రమంలో గురువారం తెల్లవారుజామున తల్లి నిద్రిస్తున్న పక్క గదిలో చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిడదవోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కంటతడి పెట్టించిన లేఖ:
ఆత్మహత్యకు ముందు నాగరత్నం ఓ సూసైడ్ లెటర్ రాసింది. ఇందులో కల్యాణ్ అంటే తనకున్న ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. నాకన్నా నువ్వే ఎక్కువ అంటూ మొదలుపెట్టి.. నీకు దూరం అవుతున్న నాగరత్నం అంటూ లేఖను ముగించింది.
'బావా నిన్ను ఒకే ఒకసారి చూడాలని ఉందిరా.. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి బావా' అంటూ తన ప్రేమను వ్యక్తపరిచింది. మీ అమ్మ-నాన్నలతో పాటు నువ్వు కూడా నన్ను మోసగించడాన్ని తట్టుకోలేకపోతున్నా అంటూ వాపోయింది. నీ మనసు చాలా మంచిది కాబట్టే.. నిన్ను ప్రేమించానని చెప్పుకొచ్చింది.
చనిపోయే ముందు కల్యాణ్ ను ఒకసారి చూడాలని ఉందని తన చివరి కోరిక గురించి రాసింది. 'నేనంటే ఇష్టం లేదు కాబట్టి.. ఇక జీవితమంతా ఆనందంగా ఉండు.. లవ్ యు రా బంగారం.. నీకు దూరమవతున్న నీ మణి' అంటూ ముగించింది. వచ్చే జన్మంటూ ఉంటే నీకే నా జీవితం అని యువతి పేర్కొనడం గమనార్హం.
అమ్మను క్షమించమంటూ:
'నాలో నేను కుమిలిపోతూ.. మీ ముందు నవ్వుతూ నటించడం ఇక నావల్ల కాదు. నాకు బతకడం ఇష్టం లేదు. నాన్నను బాగా చూసుకో.. చెల్లిని బాగా చదివించు.. నేను సంతోషంగానే చనిపోతున్నాను.. నన్ను క్షమించండి.. నాకు ఏడుపు వస్తోంది. ఐ లవ్ యూ అమ్మా.. మీకు దూరమవుతున్న మీ మణి' అంటూ లేఖలో నాగమణి పేర్కొంది. నాగమణి లేఖ స్థానికులను కదిలించింది. కంటతడి పెట్టుకునేలా చేసింది. మరోవైపు కూతురి మరణంతో నాగమణి కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.