నన్ను వాడి గదికి రమ్మంటున్నాడు.. : కంటతడి పెట్టించిన యువతి సూసైడ్ నోట్
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపింది. ఓ యువకుడు తనను వేధిస్తున్నందు వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలు తన తల్లికి రాసిన ఆ సూసైడ్ నోట్ స్థానికులను కంటతడి పెట్టించింది. తాను చనిపోయాక కూడా నిందితుడిని ఏమి చేయవద్దని.. లేదంటే తన ఫోటోలు బయటపెడుతాడని యువతి పేర్కొనడం గమనార్హం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్లో ఏముంది..
'అమ్మా.. నేను ఏ తప్పు చేయలేదు.. చేయని తప్పుకు బలైపోయాను. ఈ నిర్ణయం తప్పు అని తెలుసు. కానీ తప్పట్లేదు. నాకు బతకాలని ఉన్నా.. వాడు బతకనివ్వడం లేదు. నా ఫోటోలు బయటపెడుతానని బెదిరిస్తున్నాడు. నన్ను అతని రూమ్కి రమ్మంటున్నాడు. ఈ విషయం నీకు చెప్పాలనుకున్నా.. కానీ నీ కళ్లల్లోకి చూసి చెప్పాలంటే భయం వేసింది.' అని సూసైడ్ నోట్లో పేర్కొంది.
బతకాలని ఉన్నా..
'నాకు తెలుసు చిన్నప్పటినుంచి నువ్వు మమ్మల్ని ఎంత కష్టపడి పెంచావో. ఐలవ్యూ అమ్మా.. ఐ మిస్ యూ సోమచ్.. నిన్ను బాధపెడుతున్నందుకు సారీ అమ్మా. నాకు నీతో కలిసి బతకాలని ఉంది. ఏ లోటు లేకుండా పెంచావమ్మా.' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఎప్పటికైనా నా ఫోటోలు
'నాకు ఒక చిన్న సహాయం చేయండి. నన్ను వేధించిన ఆ యువకుడిని వదిలేయండి. లేదంటే వాడు ఎప్పటికైనా నా ఫోటోలు బయటపెడుతాడు. అలా చేస్తే నా ఆత్మకు శాంతి కలగదు. ఇదొక్కటి చేయండి. ఇదే నా చివరి కోరిక.' అని విజ్ఞప్తి చేసింది.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు..
సూసైడ్ నోట్లో వేధింపుల గురించి ప్రస్తావించినప్పటికీ.. ఎవరా యువకుడు అన్నది మాత్రం యువతి వెల్లడించకపోవడం గమనార్హం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. కుమార్తె మరణంతో ఆమె తల్లి కన్నీరుమున్నీరైంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళా సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేశారు.