ఉషారాణి ఆత్మహత్య: ర్యాగింగ్ ఇంతలానా?, 6గురు సీనియర్లపై కేసు
ఇంజనీరింగ్ విద్యార్థిని ఉషారాణి.. సీనియర్ల ర్యాంగింగ్తో బలవన్మరణానికి పాల్పడింది.
కర్నూలు/కడప: ర్యాగింగ్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్థిని ఉషారాణి.. సీనియర్ల ర్యాంగింగ్తో బలవన్మరణానికి పాల్పడింది. ఆమెను నిత్యం ఓ ఆరుగురు సీనియర్లు వేధింపులకు గురిచేసేవారని తెలిసింది. దీంతో సదరు ఆరుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఆమె మరణానికి కారణంగా తెలుస్తోంది.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: ర్యాగింగ్కు విద్యార్థిని బలి
కర్నూలు జిల్లా పాణ్యం ఆర్జీఎం కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న కడప జిల్లా బద్వేలు మండలం పుట్టాయిపల్లెకు చెందిన విద్యార్థిని బీరం ఉషారాణి(18)వసతి గృహంలోనే విషం తాగి.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.
మృతురాలి తండ్రి బీరం జయరామిరెడ్డి పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. ఆకళాశాలలో చదువుకుంటున్న ఆరుగురు సీనియర్లు ఉషారాణిని ర్యాగింగ్ చేసేవారు. ముఖం, దుస్తులపై పెరుగుపోయడం, నడిచి వెళ్లేటప్పుడు కాళ్లు అడ్డు పెట్టి కింద పడేవిధంగా చేయడం, కింద పడిపోయినప్పుడు దుస్తులు చిరిగిపోతే సెల్ఫోన్లలో ఫొటోలు తీసి ఇతరులకు పంపించడం, ఆపై అసభ్యంగా చేసి నెట్లో పెడతామని బెదిరించేవారు.
కాగా, ర్యాగింగు విషయాన్ని ఉషారాణి ఫోన్ ద్వారా తండ్రి జయరామిరెడ్డికి తెలిపారు. దీంతో ఆయన రెండు దఫాలుగా కళాశాల యాజమాన్యంతో మాట్లాడారు. అయినా మార్పు రాకపోవడంతో తనను ఇంటికి తీసుకెళ్లాలని ఉషారాణి తండ్రిని ఫోన్లో కోరారు. దీంతో జయరామిరెడ్డి గురువారం ఆమె చదువుతున్న కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ను కలిసి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లటానికి అనుమతి తీసుకున్నారు.
ఉషారాణి వసతి గృహానికి వెళ్లి కొద్దిసేపటి తరువాత తండ్రితోపాటు ఇంటికి బయలుదేరింది. నంద్యాలలో కుమార్తెకు పాదరక్షలు కొనేందుకు తీసుకెళ్లగా.. అక్కడ ఆమె వాంతి చేసుకుంది. దీంతో ఆమెను ఆళ్లగడ్డలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. ఉషారాణి విష ద్రావణం తాగిందని పరిస్థితి విషమంగా ఉందనడంతో వెంటనే ఆమెను కడపలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.
విద్యార్థిని మృతదేహాన్ని స్వగ్రామమైన పుట్టాయపల్లెకు తీసుకెళ్లారు. జయరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురు సీనియర్ విద్యార్థినులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామాంజనేయులు నాయక్ తెలిపారు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడం వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు డీఐజీ రమణకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఆర్జీఎం కళాశాల వసతి గృహంలోని ఉషారాణి గదిని పరిశీలించారు. సహచర విద్యార్థినులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.