ఊహించని విషాదం: పాట పాడుతూనే కుప్పకూలిన బాలిక..
గుంటూరు: పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా సాగిపోతున్న 'నలుగు' తతంగంలో మృత్యువు విద్యుద్ఘాతం రూపంలో ఓ బాలికను బలితీసుకుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సందడి చేసిన బాలిక.. ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.
ఇంతకీ ఏమైంది?:
మాచర్ల మండలంలోని రేగులవరం తండా గ్రామానికి చెందిన వడితె శ్రీను, దరియాల రెండో కుమారుడు సాయికి మే 2న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి సమయం దగ్గరపడటంతో ఇళ్లంతా అలంకరించి అంతా వివాహ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం సాయికి నలుగు పెట్టే తంతు నిర్వహించారు.
పాటలు పాడుతుండగా షాక్..:
నలుగు తంతు కోసం బంధువులు, ఇంటిపక్క మహిళలు సాయి ఇంటికి వచ్చారు. ఇదే క్రమంలో సాయి బంధువైన వడితే సునీత(16) కూడా అక్కడికి వచ్చింది. నలుగు పెడుతున్న సమయంలో మహిళలంతా సరదాగా పాటలు పాడారు. సునీత సైతం పాట పాడేందుకని పక్కనే ఉన్న మైక్ అందుకుంది. కానీ ఆ మైక్ ద్వారా విద్యుత్ ప్రసరణ జరగడంతో సునీతకు షాక్ తగిలింది.
స్పృహ కోల్పోయిన సునీత..:
విద్యుత్ షాక్ తగలగానే సునీత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఏమైందో అర్థంకాక అక్కడున్న మహిళలు సునీతను తట్టిలేపే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వడితె లక్ష్మి, జమిలి సొమ్మసిల్లిలకు కూడా విద్యుత్ షాక్ తగిలి స్పృహ కోల్పోయారు. సునీతను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు.
విషాదఛాయలు:
గాయాలైన మహిళలను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాచర్ల రూరల్ ఎస్ఐ లోకేశ్వరరావు సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం సునీత మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. కూలీ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్న సునీత అకాల మరణంతో ఆమె కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.