హైదరాబాద్ కాల్ సెంటర్ ఉద్యోగినిపై విశాఖలో కారులో గ్యాంగ్ రేప్
విశాఖపట్నం: విశాఖపట్నం నగర పరిధిలోని పెందుర్తిలో ఒక వివాహంలో పాల్గొనేందుకు వచ్చిన యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఒక యువతి పెందుర్తిలో జరిగే వివాహానికి గురువారం హాజరైంది. వివాహానంతరం ఆ యువతి తిరిగి హైదరాబాద్కు వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చింది.
ఇదే సమయంలో నలుగురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి, కారులో తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. వీరు రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజాము వరకూ ఆమెపై అత్యాచారం జరిపి, ఆ తరువాత ఆమెను రోడ్డుపై వదిలి వెళ్లినట్టు తెలిసింది. బాధితురాలు ఈ విషయాన్ని హైదరాబాద్లోని తన కుటుంబ సభ్యులకు తెలియచేయటంతో వెంటనే ఆమె కుటుంబ సభ్యులు పెందుర్తిలోని తమ బంధువులకు సమాచారం అందించారు.
వెంటనే వారు రంగంలోకి దిగి, ఒక వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి వద్ద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతనిని రెండవ పట్టణ పోలీస్స్టేషన్కు అప్పగించారు. నిందితుడిని పోలీసులు విచారించారు. బాధితురాలు హైదరాబాదులోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్లు సమాచారం. 23 ఏళ్ల ఆమె స్వస్థలం విజయవాడ.
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలి పెళ్లికి హాజరు కావడానికి ఈ నెల 3వ తేదీన ఆమె విశాఖ వచ్చింది. నిందితుల్లో శివశేఖర్ అనే యువకుడి ఫోన్ నెంబర్ తెలుసుకున్న యువతి శుక్రవారం సాయంత్రం పోలీసుల సాయంతో విశాఖ బస్టాండ్కు పిలిపించింది. అతడిని పోలీసులు పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురు మణికంఠ, చందు, కిరణ్ పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకోవడానికి డిసిపి త్రివిక్రమ వర్మ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.