సినీ ఫక్కీలో 'అనంత'లో అమ్మాయి కిడ్నాప్: ప్రేమే కారణమా?
అమరావతి: సాధారణంగా ఇలాంటి కిడ్నాప్లు సినిమాల్లోనో లేదా టీవీ సీరియల్లోనూ చూస్తుంటాం. కానీ సినీ ఫక్కీలో ఓ యువతిని వెంటాడి కిడ్నాప్ చేసిన ఘటన అనంతపురం జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలంలోని ప్యాదిండి గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకుంది.
ఈ కిడ్నాప్ ఘటనపై ప్రత్యక్ష సాక్షులైన తల్లిదండ్రులు తమతో ఆటోలో కలిసి వెళ్తున్న తమ కుమార్తెను వెంటాడి కిడ్నాప్ చేశారని పోలీసులకు చేశారు. వివరాల్లోకి వెళితే... రామగిరి మండలం కుంటిమద్దికి చెందిన లక్ష్మీదేవి, నల్లప్ప దంపతులు తమ కుమార్తె జయలక్ష్మిని వెంట పెట్టుకుని ఆటోలో ధర్మవరం బయలుదేరారు.
వారు ప్రయాణిస్తున్న ఆటో ప్యాదిండి గ్రామం దాటగానే అప్పటికే కాపు కాచిన కిడ్నాపర్లు సఫారి వాహనాన్ని ఆటోకు అడ్డం నిలిపారు. అడ్డొచ్చిన ఆటో డ్రైవర్పై దాడిచేశారు. జరిగిన ఘటనపై తేరుకునేలోపే ఆటోలో ఉన్న యువతిని సఫారీ వాహనంలోకి లాక్కొని వెళ్లి అక్కడి నుంచి పరారయ్యారు.
వారి వాహనం తిరిగి ప్యాదిండి చందమూరు గ్రామాల మీదుగా అడ్డదారిలో కనగానపల్లి మండలం బూడిదికొట్టాల జాతీయ రహదారిపైకి చేరుకుంది. అక్కడ సఫారీ వాహనాన్ని వదిలేసి ముందస్తు ప్రణాళిక ప్రకారం అప్పటికే సిద్ధంగా ఉన్న మరో వాహనంలో పరారైనట్టు పోలీసులు పేర్కొంటున్నారు.
కాగా అదే గ్రామానికి చెందిన నరేంద్ర అనే యువకుడు మరో ఐదుగురితో వచ్చి తమ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీకేపల్లి సీఐ రాజ, రామగిరి ఎస్ఐలు జమాల్బాషా, శేఖర్ తమ సిబ్బందితో కలిసి మూడు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కిడ్నాపర్లు ఉపయోగించిన సఫారీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతాన్ని సవాల్గా తీసుకున్నామని కిడ్నాపర్లను త్వరలో పట్టుకుంటామన్నారు. అయితే గ్రామస్థుల వెల్లడించిన వివరాల ప్రకారం కొన్నేళ్ల క్రితం నరేంద్ర, జయలక్ష్మి ఇంటి నుంచి పారిపోయినట్టు తెలిపారు.
ఆ తర్వాత యువతి తల్లిదండ్రులు ఆ జంటను గ్రామానికి తీసుకొచ్చి విడదీసినట్టు వివరించారు. అయితే నరేంద్ర మాత్రం మేం పెళ్లి చేసుకున్నామని పోలీసుల ఎదుట చెప్పాడు. అయితే ఆ యువతి మాత్రం తాను దైవదర్శనం కోసం వెంటవెళ్లానే కానీ మాకు ఎలాంటి వివాహం జరగలేదని, నాకు అతనంటే ఇష్టం లేదని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.