పరువు హత్య: తమ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని.. కన్నకూతుర్నే చంపేశారు
అనంతపురం: తమకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురును దారుణంగా హత్య చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలో చోటు చేసుకుంది.
ఇష్టం లేని పెళ్లి చేసుకుందని
మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందనే ఆగ్రహంతో కుటుంబసభ్యులే హత్య చేసి హెచ్చెల్సీలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హేమశ్రీ, మోహన్రాజు(20) పది రోజుల కిందట తిరుమలకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీధుల్లో కొట్టుకుంటూ..
ఇటీవలే ఆమె యువకుడితో కలిసి గ్రామానికి వచ్చింది. ఆగ్రహం పట్టలేని తల్లిదండ్రులు నాలుగురోజుల కిందట యువతిని వీధుల్లో కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి నుంచి యువతి, తల్లిదండ్రులు గ్రామంలో కనిపించలేదు. ఈ క్రమంలో గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
పోలీసులకు సమాచారం ఇచ్చినా..
గ్రామస్తుల కథనం ప్రకారం.. వివాహం చేసుకుని గ్రామానికి వచ్చారని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటికి వచ్చారు. ఇంటికి రావాలని తల్లిదండ్రులు యువతిని కోరారు. ఆమె ససేమిరా అనటంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై కొందరు యువకులు 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చారని, పోలీసులు స్పందించలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
తల్లిదండ్రులను విచారణ
కాగా, యువతి మృతదేహం హెచ్చెల్సీ కాలువలో ఆదివారం లభ్యమైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ మృతదేహం చెన్నంపల్లికి చెందిన యువతి హేమశ్రీ(16)దిగా గుర్తించారు. దీనిపై మంగళవారం యువతి తల్లిదండ్రులు ఎర్రమ్మ, నారాయణస్వామితో పాటు బాబాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని సీఐ శ్రీహరి చెప్పారు. కాగా, ఇటీవల ఇలాంటి పరువు హత్యలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయంగా మారింది.