కదిరిలో బాలికపై అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు
అనంతపురం: బెదిరించి మూడు నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్న ఘటన పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్ధ ప్రతినిధుల ద్వారా వెలుగుచూసింది. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కదిరి పట్టణ శివారు బాలప్పగారిపల్లిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న మైనారిటీ వర్గానికి చెందిన బాలిక (14) పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. బడికి వెళ్లే సమయంలో ఓ విద్యార్ధి తరుచుగా వేధిస్తున్నాడు. విద్యార్ధి బారి నుంచి రక్షించాలంటూ మూడు నెలల క్రితం ఆ బాలిక కదిరికి చెందిన ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఇలియాజ్ను ఆశ్రయించింది.
పోలీసులకు మంచి సంబంధాలు ఉన్నాయని నమ్మబలికిన ఇలియాజ్ బాలికతో చనువు పెంచుకుని తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. అలా ఓ రోజు బాలిక ఇంట్లో ఎవరూ లేనిది చూసుకుని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించాడు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బాలికను చంపుతానని బెదిరించాడు. మూడు నెలల పాటు తరచూ ఇలియాజ్ బాలికపై అత్యాచారం చేసేవాడు. దాంతో బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి వెల్లడించింది. నవంబర్ 1వ తేదీ బాలిక ఇంటికి వచ్చిన ఇలియాజ్ను బాలిక తల్లి నిలదీసింది. దీంతో నిన్ను కూడా చంపేస్తానంటూ బెదిరించాడు.
చివరకు ధైర్యం చేసిన బాలిక కదిరికి చెందిన పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్ధ జిల్లా అధ్యక్షురాలు వసూరమ్మ, కార్యదర్శి నర్సింహులును ఆశ్రయించింది. సోమవారం ఎస్పీ రాజశేఖర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని కదిరి డీఎస్పీని ఆదేశించారు.
డీఎస్పీ విచారణ జరిపి.. నిందితుడు ఇలిలాయాజ్పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చసినట్లు పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. నిందితుడిపై 376, 506, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇలియాజ్ పరారీలో ఉన్నాడు.
ఈ విషయంపై తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టులు ఏర్పాటు చేసిని మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీవ్ ఓవైసీని స్పందించారు. బాలికపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తున్నానని అన్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.