కడప జిల్లాలో దారుణం...బాలికపై ఇంటర్ విద్యార్థుల అత్యాచారం
కడప:దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం, ఏలూరులో గ్యాంగ్ రేప్ ఘటనలు మరువక ముందే కడప జిల్లాలో మరో దారుణం చోటుసుకుంది. ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే...
కడప జిల్లా బద్వేల్ లోని సుందరయ్య కాలనీకి చెందిన ఓ బాలిక ను రమేష్, క్రిష్ణ అనే ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు బలవంతంగా ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఎలాగో ఇంటికి చేరుకున్న ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో కుమార్తెపై అత్యాచారం విషయమై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన పోలీసులు బాలికను వైద్యచికిత్సల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరిపి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులను గుర్తించి అరెస్ట్ చేశారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.