మినహాయింపుపై కొడాలి నాని పిటిషన్: ఎస్పీవై రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నేత, నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్పీవై రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీలో దేశీయ తయారీ విదేశీ మద్యం ఉత్పత్తి డిస్టలరీ ఏర్పాటు కోసం ఎస్పీవై రెడ్డి దరఖాస్తుకు లైనెన్స్ ఫీజును 2009 నుంచి కాకుండా 2011 ప్రకారం లెక్కకట్టాలని హైకోర్టు తేల్చి చెప్పింది.
లైసెన్స్ ఫీజుగా రూ.17 కోట్లు కాకుండా రూ. 51 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్పీవై రెడ్డికి ఏపీ ప్రభుత్వం మినహాయింపులను సవాల్ చేస్తూ వైసీపీ నేత కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ భోసలే ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
తాను చేసిన స్వీయ తప్పిదాల ద్వారా ప్రయోజనం పొందాలని ఎస్పీవై రెడ్డి ప్రయత్నిస్తే అందుకు తాము అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల మేరకు నిర్దేశించిన గడువులోగా మద్యం పరిశ్రమ నిర్మాణ పనులను పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించకపోవడం ఎస్పీవై రెడ్డి తప్పేనని వ్యాఖ్యానించింది. ఆ తప్పు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఎస్పీవై రెడ్డి భారీ నష్టం కలిగించారని ఆక్షేపించింది.
రాజకీయ దురుద్దేశాలతోనే కొడాలి నాని ఈ వ్యాజ్యం దాఖలు చేశారనే ఎస్పీవై రెడ్డి వాదలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 2008లో ఎస్పీవై రెడ్డికి జారీ చేసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) గడువు 2011లో ముగిసిందని, అయితే ప్రభుత్వం మళ్లీ దాన్ని ఎప్పటికప్పుడు 2015 వరకు పొడగిస్తూ వెళ్లిందని, ఇది ఎపి మద్యం నిబంధనలకు విరుద్ధమని అంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కొడాలి నాని హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.