ప్రేమోన్మాది దాడి : యువతికి 12 కత్తిపోట్లు, సూసైడ్ కు యత్నం
తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా ఓ యువతిపై దాడి చేసి.. అనంతరం తననూ గాయపరచుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం రాత్రి జరిగింది.
తాడేపల్లిగూడెం: తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా ఓ యువతిపై దాడి చేసి.. అనంతరం సూసైడ్ యత్నంలో భాగంగా తననూ గాయపరచుకున్న ఘటన ఇది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన సంచలనం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మురుకి సంజయ్ కుమార్ బీటెక్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రమోటర్ గా పనిచేస్తున్నాడు.
అదే ప్రాంతానికి చెందిన యువతి స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఏడాదిన్నర కాలం నుంచి వీరిద్దరూ పరస్పరం ఇష్టపడుతున్నారు. అయితే అతడితో మాట్లాడరాదని, కలవరాదని ఆమె కుటుంబ సభ్యులు మూడు నెలలుగా కట్టడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సమీపంలోని విమానాశ్రయ భూముల్లోకి రమ్మని సంజయ్ కుమార్ తాను ప్రేమిస్తున్న యువతికి చెప్పాడు. రాత్రి 7 గంటల సమయంలో అక్కడికి వెళ్ళిన ఆ యువతితో కొంతసేపు మాట్లాడిన సంజయ్ కుమార్ ఒక్కసారిగా జేబులోంచి కత్తి తీసి ఆమెపై దాడి చేశాడు.
విచక్షణారహితంగా 12 చోట్ల పొడవడంతో సదరు యువతి తీవ్రంగా గాయపడింది. అనంతరం సంజయ్ కుమార్ కూడా కత్తితో తన కుడి కాలుపై పోడుచుకున్నాడు. హటాత్తుగా జరిగిన ఈ దాడి నుంచి తేరుకున్న ఆ యువతి పెద్దగా కేకలు వేసింది.
అదేసమయంలో అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు ఆమె కేకలు విని, జరిగింది అర్థం చేసుకుని వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని తీవ్రంగా గాయపడిన యువతితోపాటు సంజయ్ కుమార్ ను కూడా స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను వెంటనే ఏలూరులోని ఆసుపత్రికి తరలించి, సంజయ్ కుమార్ కు మాత్రం స్థానిక ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే తన సిబ్బందితో ఆసుపత్రికి చేరుకున్న పట్టణ ఎస్సై ఐ.వీర్రాజు ఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.